వైసిపి లాగే టిఆర్ఎస్: రేవంత్ రెడ్డి, గుత్తా సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్/ నల్లగొండ: వరంగల్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రజాతీర్పును శిరసావహిస్తామని తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్రెడ్డి అన్నారు. ఆయన మంగళవారంనాడు మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ ఇలానే ఉంటాయన్నారు. గతంలో వైయస్సార్ కాంగ్రెసు కాంగ్రెసు పార్టీ ఉప ఎన్నికల్లో ఇదే ఫలితాలు సాధించిందని, సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిందని గుర్తు చేశారు.
తెలంగాణలో 2019 ఎన్నికల్లో ఇదే పునరావృతం అవుతుందన్నారు. టీఆర్ఎస్కు అసలైన ప్రత్యామ్నాయం తామేనని అన్నారు. ప్రతిపక్షాలు ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలన్నారు. అలాగే ప్రస్తుతం పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో టీడీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందన్నారు.
ఓ వైపు వరంగల్ లోక్సభ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో దూసుకువెళ్తుంటే కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించేందుకు టీడీపీతో సహా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని ఆయన అన్నారు. వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు.
టిఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాలంటే తెలంగాణలో వామపక్షాలతో పాటు టీడీపీని సైతం కలుపుకుని పోవాల్సిన అవసరం ఉందని గుత్తా వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ విషయంలో మొదటి నుంచి స్పష్టమైన వైఖరితో ముందుకువెళ్తున్న గుత్తా ఒక్కసారి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనాలకు దారి తీస్తోంది.