విరాళాలు- ఖర్చులు: టీఆర్ఎస్ పార్టీకి విరాళాలు ఎంతొచ్చాయి ...ఎంత ఖర్చు చేసింది..?
2019 సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇక ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి ఆయా రాజకీయ పార్టీలు. ఇందుకోసం కావాల్సిన నిధులను కూడా విరాళాల రూపంలో సేకరిస్తున్నాయి. ఇక విరాళాలు రూపంలో వచ్చిన నిధుల్లో జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్లు ముందంజలో ఉండగా.. ప్రాంతీయ పార్టీలు కూడా క్రమంగా నిధుల సేకరణలో పుంజుకుంటున్నాయి. 2019ఎన్నికలకు ఇప్పటి నుంచే నిధులు సమకూర్చే పనిలో పడ్డాయి ఆయా పార్టీలు. ఇక ఇదే విషయాన్ని ఆయా పార్టీలు 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఫైల్ చేసిన ఇన్కంటాక్స్ రిటర్న్స్ కూడా ధృవీకరిస్తున్నాయి.
నిధుల సేకరణలో డీఎంకే ఫస్ట్...టీఆర్ఎస్ సెకండ్
ప్రాంతీయ పార్టీలో అత్యధిక నిధులు విరాళాల రూపంలో సేకరించిన పార్టీ డీఎంకే పార్టీ. స్టాలిన్ నేతృత్వంలో నడుస్తున్న ఈపార్టీ రూ.35 కోట్లు సేకరించినట్లు సమాచారం. ఇక అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ 27.7 కోట్లు విరాళాలు సేకరించగా... ఆ తర్వాత మరో ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం రూ.19 కోట్లు సేకరించింది. 2016-17లో అత్యధికంగా నిధులు సేకరించిన సమాజ్ వాదీ పార్టీ ఈసారి ఆ పార్టీకి ఏమేరకు నిధులు వచ్చాయో ఇంకా బహిర్గతం చేయలేదు. నవీన్ పట్నాయక్ పార్టీ బిజూ జనతాదల్ 14 కోట్లు విరాళాల రూపంలో పొందింది. అంతకుముంది రూ.1.88 కోట్లుగా చూపించింది. ఈ సారి ఫైల్ చేసిన రిటర్న్స్లో 13 రెట్లు బీజేడీ పార్టీ విరాళాలు పెరిగినట్లు తెలుస్తోంది.
ఎన్నికల రాష్ట్రాల్లో 70శాతం నగదు ఒక్క తెలంగాణలోనే పట్టుబడింది
డిసెంబర్ 7న ఎన్నికలకు వెళ్లనున్న తెలంగాణలో డబ్బులు ఏరులై పారుతోంది. ఈ సారి ప్రధాన పార్టీల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లుగా ఉండటంతో నేతలు సైతం ఎంత డబ్బు అయినా సరే ఖర్చు చేసేందుకు సిద్ధమైపోతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఈ సారి ఎన్నికలను డబ్బు డిసైడ్ చేస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నవంబర్ 1 వరకు ఉన్న సమాచారం మేరకు తెలంగాణలో రూ.50 కోట్లకు పైగా నగదు పట్టుబడినట్లు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల్లో కలిపి రూ.70 కోట్లు పట్టుబడగా ఒక్క తెలంగాణలోనే 70శాతం డబ్బులు దొరికినట్లు అధికార లెక్కలు ధృవీకరిస్తున్నాయి. ఇక బరిలోకి దిగిన ప్రధాన పార్టీలు ఇప్పటికే రూ.12 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఇక ఈ ఖర్చు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముంది. ఇక భారత ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ సమర్పించిన 2017-18 ఆడిట్ రిపోర్ట్ ప్రకారం రూ.27.2 కోట్లు విరాళాలు వచ్చినట్లు పేర్కొంది. ఇందులో రూ.12 కోట్లు ఖర్చు చేసినట్లు చూపించింది. ఇక చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ రూ.16 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది.
టీడీపీ రూ.19 కోట్లు... వైసీపీకి రూ.14 కోట్లు విరాళం
టీడీపీ రూ. 19 కోట్లు విరాళాల రూపంలో సేకరించగా... ఏపీలో మరో ప్రాంతీయ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైయస్సార్ సీపీ రూ. 14 కోట్లు విరాళంగా వచ్చినట్లు వెల్లడించింది. అయితే వచ్చిన దానికంటే రూ. 2 కోట్లు అదనంగా అంటే రూ. 16 కోట్లు ఖర్చు చేసినట్లు చూపించింది. మరో ముఖ్య పార్టీ మజ్లిస్ ఇంకా తమ విరాళాలను ప్రకటించాల్సి ఉంది. 2016-17లో మజ్లిస్ పార్టీ రూ.7 కోట్లు విరాళంగా అందుకోగా... అందులో రూ.5 లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. ఇక వాస్తవానికి అన్ని రాజకీయ పార్టీల తమకు వచ్చిన విరాళాలకంటే ఎక్కువగనే ఖర్చు చేస్తున్నాయి. 2016-17లో టీఆర్ఎస్కు రూ.3.7 కోట్లు విరాళాల రూపంలో రాగా.. అది 64.9 కోట్లు ఖర్చు చేసినట్లు చూపించింది. టీడీపీ రూ.72 కోట్లు విరాళంలో రూపంలో రాగా.. రూ. 24 కోట్లు టీడీపీ ఖర్చు చేసింది.
రాష్ట్రాల వారీగా ప్రాంతీయ పార్టీల విరాళాలు ఖర్చులు
తెలంగాణ బయట ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల విరాళాలు ఖర్చులు ఒకసారి పరిశీలిస్తే... డీఎంకేకు రూ.35 కోట్లు రాగా ఇప్పటికే రూ. 27 కోట్లు ఖర్చు చేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో డీఎంకేకు రూ. 3 కోట్లు మాత్రమే విరాళం రూపంలో రాగా... ఖర్చు మాత్రం రూ.85 కోట్లకు ఎగబాకింది. నితీష్ కుమార్ పార్టీ జేడీఎస్ రూ. 8 కోట్లు సేకరించగా... రూ.12 కోట్లు ఖర్చు చేసినట్లు చూపించింది. ఇక పంజాబ్లోని శిరోమని అకాళీదల్ రూ.3.9 కోట్లు సేకరించగా... రూ.14.9 కోట్లు ఖర్చు చేసింది.