సాలు దొర-సెలవు దొర: బీజేపీ డిజిటల్ బోర్డుపై బాల్క సుమన్ ఫైర్, మోడీ బోర్డులే కాదు..!
హైదరాబాద్: బీజేపీ నేతల తీరుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 'సాలు దొర.. సెలవు దొర' అనే డిజిటల్ బోర్డును తీసేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రధాని మోడీ బోర్డులు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి.. చెప్పుల దండ వేస్తామని హెచ్చరించారు.

బీజేపీకే కౌంట్ డౌన్ అంటూ బాల్క సుమన్
టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం నుంచి ఎమ్మెల్యేలు వివేకానంద, ముఠా గోపాల్, డాక్టర్ మెతుకు ఆనంద్, నోముల భగత్, ఎమ్మెల్సీ దండే విఠల్తో కలిసి సుమాన్ మాట్లాడారు.ఈ సందర్భంగా బాల్క సుమన్ బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలు పడగొట్టే ప్రయత్నాలకు మోడీ ప్రాధాన్యత ఇస్తున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. కౌంట్ డౌన్ బీజేపీకే మొదలైంది తప్పా.. టీఆర్ఎస్కు కాదన్నారు.

బీజేపీపై తీవ్రస్తాయిలో విమర్శలు గుప్పించిన బాల్క సుమన్
దేశంలో మోడీ దిగిపోవాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారని బాల్క సుమన్ అన్నారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా తదితర రాష్ట్రాల్లో విపక్షాల ప్రభుత్వాలను బీజేపీ కూలగొట్టిందని గుర్తు చేశారు బాల్క సుమన్. ఇప్పుడు మహారాష్ట్రలోనూ అదే పని చేస్తోందని విమర్శించారు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వాలను కూల్చే పనిలో బీజేపీ పడిందని ఆరోపించారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ ప్రభుత్వం యువతను మోసం చేసిందన్నారు. పాలమూరుకు జాతీయ హోదా ఇస్తారా? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెడతారా? లేదా అని బాల్క సుమన్ ప్రశ్నించారు. బండి సంజయ్ ఇక నుంచైనా హుందాగా మాట్లాడాలని సుమన్ హితవు పలికారు.
సాలు దొర-సెలవు దొర అంటూ బీజేపీ డిజిటల్ ప్రచారం
కాగా, టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, ఇంకా మరో 529 రోజులే ఉన్నాయంటూ గంటలు, నిమిషాలు, సెకన్లను కౌంట్ డౌన్ గా చూపుతూ సెలవుదొర అనే వెబ్ సైట్ ప్రారంభించింది బీజేపీ. ఈ వెబ్ సైట్ లో అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరారు బీజేపీ నేతలు. 'సాలు దొర-సెలవు దొర', కల్వకుంట్ల కౌంట్ డౌన్ అంటూ డిజిటల్ గడియారంను నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయం గేటు పక్కన ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే బాల్క సుమన్ బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.












Click it and Unblock the Notifications