ప్రియమైన బర్రెలకు విజ్ఞప్తి; వందే భారత్ రైళ్ళ వద్దకు వెళ్లొద్దు: వినూత్న నిరసన!!
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తుందని, సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటు పరం చేయబోమని రామగుండంలో ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ, ప్రైవేటీకరణ చేస్తున్నారని, సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మహా ధర్నాకు శ్రీకారం చుట్టింది. ఇక ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు వ్యతిరేకంగా వినూత్న ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి.
నేడు మోడీ వందే భారత్ రైలు ప్రారంభించిన నేపథ్యంలో ఇప్పటివరకు ఎన్ని సార్లు వందే భారత్ రైలు ప్రారంభిస్తారు అంటూ బీఆర్ఎస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఇక ఇదే సమయంలో వినూత్నంగా నిరసన తెలిపిన టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి వందే భారత్ రైలు ప్రారంభమయ్యాక ఇప్పటివరకు దాదాపు 68 ప్రమాదాలు జరిగాయని బర్రెలు, ఆవులను ఢీకొడితేనే వందే భారత రైళ్ళు దెబ్బతిన్నాయని, అవి అంత స్ట్రాంగ్ గా తయారు చేశారు అంటూ సెటైర్లు వేశారు. ఈ నేపథ్యంలో బర్రెలకు విజ్ఞప్తి చేస్తున్నానని, ఆయన పశువుల కొట్టానికి వెళ్లి పశువులకు విజ్ఞాపన పత్రంతో వందే భారత్ రైళ్ల దగ్గరికి వెళ్ళొద్దంటూ సూచించారు.
ప్రధాని నరేంద్ర మోడీ సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ రైలు ప్రారంభిస్తున్నారని, వందే భారత్ రైళ్ళు వీక్ గా ఉంటాయి కాబట్టి దయచేసి అటువైపు వెళ్ళద్దు అంటూ బర్రెలకు చెప్పారు. ప్రియమైన బర్రెలు.. మీరు పొరపాటున తాకినా రైలు దెబ్బ తినే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

బర్రెలు, ఆవులు తాకితేనే పాడైపోయే రైళ్ళను ప్రధాని నరేంద్ర మోడీ వందే భారత్ పేరుతో తీసుకువచ్చారని, ఇక అలాంటి రైళ్లతో మీకు కూడా ప్రమాదమే అంటూ బర్రెలకు చెప్పారు. మీరైనా అటువైపు వెళ్ళకుండా ఉండండి అంటూ చెప్పిన రెడ్కో చైర్మన్, మీ బంధుమిత్రులకు కూడా చెప్పి వందే భారత్ రైలు ప్రయాణించే ట్రాక్ వైపు వెళ్లకుండా చూడాలని వినూత్న విజ్ఞప్తి చేశారు.
ఇక ఇదే సమయంలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను టార్గెట్ చేసి, వందే భారత్ రైళ్లను ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. 17 సార్లు 17 రైళ్ళను స్వయానా ప్రధాని ప్రారంభించారని, అసలు రైల్వే శాఖ మంత్రి చేయాల్సిన పనిని ప్రధాని ఎందుకు చేస్తున్నారంటూ మండిపడ్డారు. పబ్లిసిటీ పిచ్చితో ప్రధాని వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి ఒక పైసా కూడా ఇవ్వకుండా ఇప్పుడు పబ్లిసిటీ కోసమే మోడీ రాష్ట్రానికి వస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి వచ్చి ఏదో ఇచ్చినట్టుగా పబ్లిసిటీ చేసుకుంటే ప్రజలు నమ్ముతారా అంటూ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికలలో బిజెపిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కచ్చితంగా ఓడిస్తారని రెడ్ కో చైర్మన్ వై సతీష్ రెడ్డి తెల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications