లోక్ సభకు రేవంత్ - బండి సంజయ్ గుడ్ బై : అదే బాటలో కోమటిరెడ్డి..!?
తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఈ సమయంలో ప్రధాన నేతలు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. మరో పది నెలల కాలంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ వర్సస్ బీజేపీ రాజకీయం పతాక స్థాయికి చేరింది. టీపీసీసీలో అంతర్గత సమస్యలు పార్టీని వెంటాడుతున్నాయి.
ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్..బీజేపీ అధ్యక్షులు కీలక నిర్ణయాల దిశగా ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా లోక్ సభకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. వీరిని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డితో సహా మరి కొందరు నేతలు ఫాలో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయాలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త టర్న్ కు కారణమవుతున్నాయి.
లోక్ సభ వద్దు - అసెంబ్లీ ముద్దు
ప్రస్తుతం తెలంగాణలో రెండు జాతీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు ఎంపీలుగానే ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల పైన ఈ ఇద్దరు నేతలు భారీ ఆశలతో ఉన్నారు. అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న వేళ అసెంబ్లీకే పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరూ నేతలు ఓడిపోయారు. తిరిగి లోక్ సభకు పోటీ చేసి పార్లమెంట్ సభ్యులుగా గెలిచారు.
వచ్చే ఎన్నికలకు ఈ ఇద్దరు నేతలు తమ పార్టీలకు రధసారధులుగా ముందుకు తీసుకెళ్తున్నారు. బండి సంజయ్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ లేదా కరీంనగర్ నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్ తో పాటుగా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్ గిరీ పార్లమెంట్ పరిధిలోని ఎల్బీ నగర్ వైపు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
కిషన్ రెడ్డి - కోమటిరెడ్డి ఇద్దరూ అదే దారి..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని దాదాపు నిర్ణయానికి వచ్చారు. కిషన్ రెడ్డిని పార్టీ అధినాయకత్వం లోక్ సభకే పోటీ చేయమని సూచిస్తే, ఆయన కుటుంబ సభ్యులు ఈ సారి అంబర్ పేట నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. వీరితో పాటుగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే దాదాపుగా తన నిర్ణయం వెల్లడించారు.
భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చే ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ నుంచి పోటీ చేయనున్నారు. నల్లగొండ జిల్లాకే చెందిన మరో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో ముందుగా జరిగే అసెంబ్లీకే పోటీచేసే అవకాశాలున్నాయి. ఆయన హుజూర్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారని సమాచారం.
అయితే, కాంగ్రెస్ లోనే కొనసాగుతారా లేక మరో పార్టీ వైపు చూస్తారా అనేది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. నిజమాబాద్ ప్రస్తుత బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వచ్చే ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అవకాశాలున్నాయి. అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు కూడా అసెంబ్లీ నుంచే బరిలోకి దిగనున్నారు. తన పార్లమెంటు స్థానం పరిధిలోనే ఉన్న బోథ్, లేదా ఆసిఫాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగే ఛాన్స్ కనిపిస్తోంది.
గులాబీ పార్టీ నేతలు చూపు అసెంబ్లీ వైపే
బీజేపీ, కాంగ్రెస్ తో పాటుగా టీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ బరిలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. చేవెళ్ల ఎంపీగా ఉన్న రంజిత్రెడ్డి వీలైతే రాజేంద్రనగర్నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. మహబూబాబాద్ ఎంపీగా ఉన్న మాలోత్ కవిత అసెంబ్లీకి పోటీ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
ఖమ్మం నుంచి గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈసారి అసెంబ్లీకే పోటీచేయనున్నారు. రెండుసార్లు మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి గె లిచిన బీజేపీ నేత జితేందర్రెడ్డి అసెంబ్లీకే పోటీ చేయాలని భావిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కూడా ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకే దిగే అవకాశం కనిపిస్తోంది.
ప్రధాన పార్టీలకు చెందిన పలువురు మాజీ ఎంపీలు కూడా ఈసారి శాసనసభ బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో, తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తరువాత రాజకీయంగా కీలక పరిణమాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.