కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి 24గంటల డెడ్ లైన్; ధాన్యం కొనకుంటే జరిగేదిదే!!
ధాన్యం కొనుగోలు విషయంలో టిఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతూ తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ, ఢిల్లీ కేంద్రంగా కూడా మహా ధర్నా చేపట్టి కేంద్రం పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. ఇక సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి 24 గంటలు డెడ్లైన్ విధించి, ఈ లోపు నిర్ణయం తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని తేల్చిచెప్పారు.

బీజేపీపై టీఆర్ఎస్ ఒత్తిడి, టీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఒత్తిడి
ఇక ఈ క్రమంలోనే మంగళవారం నాడు మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గ అత్యవసర భేటీ నిర్వహించి ధాన్యం కొనుగోలు వ్యవహారంపై చర్చ జరిపి ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేంద్రంపై ఒత్తిడి పెంచటం కోసం టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంటే, కెసీఆర్ సర్కార్ పై ఒత్తిడి పెంచటం కోసం కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. అటు కేంద్రాన్ని తిడుతూనే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేస్తుంది.

టీఆర్ఎస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి 24 గంటల డెడ్ లైన్
ఇదిలా ఉంటే మంగళవారం మధ్యాహ్నం జరిగే మంత్రివర్గ భేటీలో ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరచి కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేసిన ఆయన ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తీసుకుని రైతులకు భరోసా కల్పించకపోతే ఎక్కడికక్కడ మంత్రులను, టిఆర్ఎస్ పార్టీ నేతలను అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

చివరి గింజ వరకు కొనాల్సిందే... లేదంటే ఊరుకునేది లేదు
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రాజకీయాలను పక్కన పెట్టి రైతులకు లబ్ధి జరిగేలా నిర్ణయం తీసుకోవాలని, మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేయాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతులకు లాభం జరిగేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి, రైతుల నుంచి చివరి గింజ వరకు కొనుగోలు చేయాలంటూ, అలా జరగకుంటే ఊరుకునేది లేదంటూ తేల్చి చెప్పారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న దొంగ నాటకాలు కట్టిపెట్టండి
రైతులకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేసి వారికి అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న దొంగనాటకాలు ఇప్పటికైనా కట్టిపెట్టాలని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా కబుర్లు కట్టిపెట్టి ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ నిర్ణయం తీసుకోవాలంటూ టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications