ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్గా ఈడీ ప్రశ్నలు, వేధిస్తున్నారని రేవంత్ రెడ్డి సంచలనం
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈడీ విచారణ రెండో రోజు ముగిసింది. మంగళ, బుధవారాలు ఆయన విచారణకు హాజరయ్యారు. ఆయనను రెండు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఓటుకు నోటు కేసు: దాని ఆధారంగా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు
నన్ను, చంద్రబాబును ఇరికించే ప్రయత్నం
ఏసీపీ పెట్టిన కేసు పైన ఈడీ అధికారులు తనను విచారించారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈడీ అధికారులు తనను అడిగిందే అడుగుతూ వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. గతంలో ఇదే కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో అన్నింటిని హైకోర్టు తప్పు పట్టిందని తెలిపారు. కానీ ఇప్పుడు ఈడీ ద్వారా తనను, చంద్రబాబును ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు టార్గెట్గా ఈడీ ప్రశ్నలు
విచారణ పేరుతో వేధిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. నిన్నటి నుంచి అడిగిన ప్రశ్నలే అడిగి వేధిస్తున్నారన్నారు. కేసీఆర్, మోడీ ఒత్తిడితోనే ఈడీ అధికారులు పని చేస్తున్నారని విమర్శించారు. కేసులో రాజకీయ కుట్ర కనిపిస్తోందన్నారు. చంద్రబాబు టార్గెట్గా ఈడీ ప్రశ్నలు ఉన్నాయని చెప్పారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే హైకోర్టు కొట్టి వేసిన కేసును తిరగదోడుతున్నారన్నారు.
వారిది ఫెవికాల్ బంధం
అంతకుముందు రోజు కూడా రేవంత్ రెడ్డి బీజేపీ, తెరాసలపై నిప్పులు చెరిగారు. కేసీఆర్, మోడీలు ఇద్దరిదీ ఫెవికాల్ బంధమని, వీరు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను పావులుగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. తన తల తెగిపడ్డా కేసీఆర్ అక్రమాలపై మాట్లాడుతూనే ఉంటానని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏసీబీని, ఇటీవల ఎన్నికల్లో ఐటీ అధికారులను ఉపయోగించుకుని కేసీఆర్ అధికారంలోకి వచ్చారని చెప్పారు. ఏదో ఒకరోజు కేసీఆర్ కూడా ఊచలు లెక్కించక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే ఛార్జీషీట్ దాఖలు చేశాక తిరిగి విచారణ చేపట్టడమేమిటన్నారు. తనపై పోటీ చేసిన పట్నం నరేందర్ రెడ్డి వద్ద రూ.51 లక్షలు దొరికినా దర్యాప్తు చేయాలంటూ ఈడీ, సీబీఐలకు ఆదేశాలు ఎందుకు జారీ చేయడంలేదన్నారు. తన మీద చిల్లర కేసులు పెట్టి ఏం చేయలేరన్నారు.