టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి : ఏఐసీసీ అధికారిక ప్రకటన : ఫైర్ బ్రాండ్ సైలెంట్ ఆపరేషన్..ఆ హామీతో..!!
ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. ఊహించిన విధంగానే ముందు నుండి ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి పీసీసీ పీఠం దక్కంది. రేవంత్ కు పీసీసీ చీఫ్ కాకుండా అడ్డుకొనేందుకు అనేక రకాల ప్రయత్నాలు జరిగినా..రేవంత్ ఢిల్లీ కేంద్రంగా సైలెంట్ ఆపరేషన్ నిర్వహించారు. చివరి వరకు రేవంత్ రెడ్డికి పోటీగా ముగ్గురు పేర్లు రేసులో ఉన్నాయి. అందు లో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుండి ప్రధానంగా పోటీ ఎదురైంది. అయితే, తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్ మాత్రమే సమర్ధుడనే గుర్తింపు పార్టీలో ఉంది.
Recommended Video
కేసీఆర్ పై దూకుడుగా ...
కేసీఆర్ అండ్ ఫ్యామిలీని రాజకీయంగా టార్గెట్ చేయటం..అదే విధంగా వాక్చాతుర్యం...జనాకర్షణ ఉండటంతో రేవంత్ వైపు హైకమాండ్ మొగ్గు చూపింది. ప్రస్తుతం తెలంగాణ కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే రెడ్డి వర్గానికే ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ పరిశీలకులు అధినేత్రి సోనియాకు నివేదిక ఇచ్చారు. ముగ్గురి పేర్లతో తుది జాబితా ఇచ్చారు. అందులో రేవంత్ రెడ్డితో పాటుగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి...శ్రీధర్ బాబు పేర్లు చివరి వరకు రేసులో ఉన్నాయి. అయితే, రాహుల్ గాంధీ జోక్యంతో చిరవకు రేవంత్ రెడ్డికే పీఠం దక్కింది. అయితే, రేవంత్ రెడ్డి 2023 ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ను తెలంగాణలోకి అధికారంలోకి తీసుకొస్తానని..కొందరు పని కట్టుకొని చేసే ఫిర్యాదులను పట్టించుకోకుండా తనకు కొంత ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది.
రేవంత్ తో పాటుగా కీలక పదవుల్లో...
రేవంత్ హామీ పైన విశ్వాసం తో ఉన్న కాంగ్రెస్ అధినాయకత్వం పీసీసీ పగ్గాలు ఇవ్వాలని నిర్ణయించింది. రేవంత్ కు పీసీసీ ఇవ్వటం ద్వారా తెలంగాణ కాంగ్రెస్ లో నేతల నుండి వ్యతిరేకత రాకుండా.. సీనియర్లకు కీలక బాధ్యతలు అప్పగించారు. కార్యనిర్వాహక అధ్యక్షులు.. ప్రచార కమిటీ ఛైర్మన్లుగా అవకాశం కల్పించారు. దుబ్బాక ఉప ఎన్నికలో పరా జయం తరువాత పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసారు.
ఆ తరువాత కొత్త అధ్యక్షుడి కోసం కసరత్తు జరిగినా కొలిక్కి రాలేదు. ఇదే సమయంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక రావటంతో అది పూర్తయిన తరువాత పీసీసీ చీఫ్ ను ఎంపిక చేయాలని సీనియర్ నేత జానారెడ్డి కోరారు. దీంతో..మరోసారి నియామకం వాయిదా పడింది. ఇక, అనేక చర్చలు..అభిప్రాయాలు.. వ్యతిరేకతలు..అనుకూలతలు పరిశీలించిన తరువాత ఈ రోజు తుది నిర్ణయం తీసుకున్నారు.
జెడ్పీటీసీగా రాజకీయ జీవితం..
రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీనియర్ల ను మరిపించేలా రాజకీయం చేయటం ద్వారా పెద్ద సంఖ్యలో అనుచర వర్గాన్ని పెంచుకున్నారు. తొలుత ఏబీవీపీ లో చురుకుగా పని చేసిన రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నుండి తొలుత జెడ్పీటీసీ సీటు ఆశించి భంగ పడ్డారు. స్వతంత్ర అభ్యర్ధిగానే పోటీ చేసి మిడ్గిల్ జెడ్పీటీసీగా గెలుపొందారు. ఆ తరువాత 2008 లో ఎమ్మెల్సీ అయ్యారు. తరువాతి కాలంలో టీడీపీలో చేరారు. ఇక, 2009, 2014 లో కొడంగల్ నుండి టీడీపీ ఎమ్మెల్యే గా గెలిచారు.
ఓటుకు నోటు వివాదం..ఎంపీ టు పీసీసీ చీఫ్..
2015 లో ఓటుకు నోటు వ్యవహారంలో జైలు కు వెళ్లారు. ఆ తరువాత కొంత కాలం టీడీపీలో కొనసాగినా..ఆ తరువాత రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. 2019లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత మల్కాజ్ గిరి నుండి ఎంపీగా గెలిచారు. ఇక, తెలంగాణ కాంగ్రెస్ లో జనాకర్షణ నేతగా గుర్తింపు పొందారు. దీంతో..ఇప్పుడు రేవంత్ కోరుకున్న విధంగా పీసీసీ చీఫ్ పదవి దక్కటంతో టార్గెట్ కేసీఆర్ లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నారు. మరి..కాంగ్రెస్ నేతల నుండి సహకారం ఏ స్థాయిలో ఉంటుందనేది మాత్రం ఆసక్తి కరంగా మారుతోంది.