అలా అంటే చెప్పులతో కొట్టండి, 2019 అనుకోవద్దు: కేసీఆర్కు రేవంత్ ఝలక్
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తద్వారా ఆయన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఝలక్ ఇచ్చారు. ఎన్నికలు 2019లోనే వస్తాయని అనుకోవద్దని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏడాదిలోనే ఉపద్రవం ముంచుకు రావొచ్చునని, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన తెలుగుదేశం పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు. తెరాస ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆయన చెప్పారు. ఆయన మహబూబ్ నగర్లో మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీని ఆంధ్రా పార్టీ అని ఎవరైనా అంటే వారిని చెప్పులతో కొట్టాలని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెరాస ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. పేదలు పేదలుగానే మిగిలారని, తెలంగాణ వాది అని అధికారం ఇస్తే కేసీఆర్ ఆయన కుటుంబానికి మేలు చేసుకున్నారే తప్ప ప్రజలను పట్టించుకోలేదన్నారు.

నవంబరు 1 నుంచి గ్రామ, గ్రామాన గడప గడపకు వెళ్లి తెదేపా చేసిన అభివృద్ధి, తీసుకొచ్చిన సంస్కరణలు వివరిస్తూ సభ్యత్వాలు నమోదు చేయాలన్నారు. తెలంగాణలో 10 లక్షలు, ఏపీలో 43 లక్షల సభ్యత్వాలు మొత్తం 53 లక్షల సైన్యం టిడిపి వద్ద ఉన్నారని అగ్రరాజ్యం అమెరికా సైన్యం 50 లక్షలని దానికంటే 4 లక్షల మంది ఎక్కువగా టిడిపి సభ్యులున్నారన్నారు. ఈసారి దీనికి మించి సభ్యత్వాలు చేయాలన్నారు.
గ్రామగ్రామాన టిడిపి జెండా ఎగరవేయాలన్నారు. గత టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు రూ.8 వేల కోట్లతో ఉమ్మడి జిల్లాలో నిర్మించిన కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులకు కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక కేవలం రూ.381 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు.
గతంలో బతుకమ్మలు ఆడవాళ్లు ఎత్తుకునేవారని తెలంగాణ వచ్చాక పురుషులు బతుకమ్మలు ఎత్తుకుంటున్నారని ఇటీవల మహబూబ్నగర్ ఎమ్మెల్యే బతుకమ్మ ఎత్తుకోవడం చూశామని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి ఏడాది క్రితం పాత పాలమూరును సందర్శించి ఇక్కడి ప్రజల ఇళ్లను, వీధులను చూసి ఎలా బతుకుతున్నారు మీకు రెండు పడక గదుల కట్టిస్తానని హామీ ఇచ్చారని నేటికి ఒక్క ఇంటినైనా కట్టించారా? అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదన్నారు. ఇప్పటికీ తెలంగాణ పల్లెల్లో ఆనాడు టిడిపి ప్రభుత్వం చేపట్టిన పనులే కనిపిస్తాయన్నారు.












Click it and Unblock the Notifications