ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి: ఒంటరి చేయాలని చూస్తే తానే...
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇప్పుడు తెలంగాణలోనూ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఫైర్ బ్రాండ్. ఆయనది దూకుడు స్వభావం. అదే ఆయన రాజకీయాల్లో ఎదగడానికి కారణమైంది. కొద్ది కాలంలోనే ఆయన రాజకీయాల్లో కీలకమైన నేతగా ఎదిగారు.
వెరపు లేకుండా ప్రభుత్వంపై తన వాగ్ధాటితో విమర్శనాస్త్రాలు సంధించడం ఆయన నైజం. తెలంగాణలో కెసిఆర్ తర్వాత వాగ్ధాటికి ఆయన పేరే చెప్పుకుంటారు. కయ్యానికి కాలు దువ్వడానికి ఏ మాత్రం వెనకంజ వేయరు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావును తన దూకుడుతో ఢీకొట్టడానికి ప్రయత్నించారు.
తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కెసిఆర్తో కలిసి రేవంత్ రెడ్డిని ఒంటరి చేయాలని ప్రయత్నాలు చేసినట్లు చెబుతారు. దాన్ని గ్రహించే రేవంత్ రెడ్డి పకడ్బందీ వ్యూహాన్ని రచించుకుని అమలు చేశారని అంటున్నారు. ఒంటరి చేయడానికి ఆయన పదవులను ఊడబీకారని అంటున్నారు.

ఎక్కడ తగ్గకుండా...
చాలా దుందుడుకుగా వ్యవహరిస్తూ ధాటిగా వ్యాఖ్యలు చేసే రేవంత్ రెడ్డి తనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలోనే కాకుండా తెలంంగాణలోనే వ్యూహరచన చేసి అమలు చేస్తున్న నేపథ్యంలో చాలా సంయమనం పాటించారు. కెసిఆర్తో తెలుగుదేశం నేతలు అంటకాగుతున్నారనే ఆరోపణలు మాత్రమే చేశారు. వ్యక్తిగతమైన ఆరోపణలు చేయలేదు. తన రాజకీయ ప్రస్థానంలో దూకుడుగా వ్యవహరిస్తూనే ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు.

కొద్ది కాలంలోనే..
1969, నవంబర్ 8న మహబూబ్నగర్ జిల్లా కొండారెడ్డి పల్లిలో జన్మించిన రేవంత్ రెడ్డి రాజకీయాల్లో ప్రవేశించిన కొద్ది కాలంలోనే తెలంగాణలో కీలకమైన నేతగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ద్వారా ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2002లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన రేవంత్ రేవంత్ రెడ్డి 2005లో మహబూబ్నగర్ జిల్లాలోని మిడ్జిల్ జెడ్పీటీసీగా మిత్రపక్షాల అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు.

ఏ మాత్రం జంకకుండా.
జడ్పీటిసి పదవీ కాలం ముగిసిపోక ముందే 2007లో జెడ్సీటీసీ పదవికి రాజీనామా చేసి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో ఎన్నికల్లో రేవంత్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. రేవంత్ రెండేళ్లపాటు ఎమ్మెల్సీగా పనిచేశారు. 2007లోనే రేవంత్ తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఎమ్మెల్యేగా...
2009లో మొదటిసారి కొడంగల్ నుంచి శాసనసభకు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రావులపల్లి గుర్నాథరెడ్డిపై విజయం సాధించారు. తెలంగాణలో టిడిపి తుడిచిపెట్టుకుని పోయిందని భావించిన తరుణంంలో 2014లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. ఇలా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

రాష్ట్ర విభజనతో...
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ టిడిపిలో రేవంత్ రెడ్డి కీలకమైన నేతగా ముందుకు వచ్చారు. పార్టీ అధినేత చంద్రబాబుకి అత్యంత విశ్వాపాత్రుడిగా మారారు. నారా లోకేష్తో కలిసి తెలంగాణలో కెసిఆర్ను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. అయితే, ఓటు నోటు కేసు, హైదరాబాద్ నగర పాలక సంస్థల ఎన్నికలు టిడిపిని ఘోరంగా దెబ్బ తీశాయి. అయినా ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా కెసిఆర్కు కంట్లో నలుసుగా మారారు.

ఆ కారణంగానే....
కెసిఆర్పై తన పోరాటానికి తెలుగుదేశం పార్టీలో ఇక అవకాశం లేదని గ్రహించిన రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెసులో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంది. తన దూకుడు, వాగ్ధాటి, కెసిఆర్పై చేస్తున్న పోరాటం కారణంగానే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని సీనియర్ల వ్యతిరేకతను కూడా లెక్క చేయకుండా పార్టీలో చేర్చుకోవడానికి సిద్దపడినట్లు చెబుతున్నారు. ఆయన వచ్చే నెల 9వ తేదీన కాంగ్రెసులో చేరడం ఖాయమైనట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications