సిఎం చర్మంతో రైతులకు చెప్పులు కుట్టించినా పాపం లేదు: రేవంత్ రెడ్డి
సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకులపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజాం వ్యతిరేకపోరాటంలో ప్రజలు రజకార్ల లాగుల్లోకి ప్రజలు తొండలు వదిలేవాళ్లని, అలాగే ఇప్పుడు టిఆర్ఎస్ నాయకులను యాప చెట్లకు కట్టేసి, లాగుల్లో తొండలు వదిలి కొట్టాలని ఆయన అన్నారు.
మెదక్ జిల్లా గజ్వెల్లో మంగళవారం రైతు కోసం చేపట్టిన దీక్షలో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చైనా పర్యటన పాస్పోర్టులను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మకావులో కెసిఆర్ బృందం తాగి తందనాలు ఆడిందని ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సచివాలయంలో జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారని అన్నారు.
రైతులను ఆదుకోవడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. కెసిఆర్ను వదిలించుకుంటే తప్ప భవిష్యత్తు లేదని ప్రజలు అనుకుంటున్నారని ఆయన అన్నారు. అన్ని పార్టీలు జెండాలు పక్కన పెట్టి రైతుల కోసం టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదిరించడానికి ముందుకు వచ్చాయని ఆయన చెప్పారు.
ప్రభుత్వాన్ని బజార్ల నిలబెట్టయినా సరే రైతులను తాము ఆదుకుంటామని ఆయన చెప్పారు. మీడియా కూడా వాస్తవాలు బయటపెట్టాలని, భయపడవద్దని ఆయన అన్నారు. ఈ నెల 10వ తేదీ బంద్కు సమాయత్తం కావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడి నాయకత్వం వర్ధిల్లాలని ఆయన నినాదాలు చేశారు.
తెలంగాణలో రైతులను ఆదుకోడానికి ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడంలేదని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. గ్రామాల్లోకి వచ్చే టీఆర్ఎస్ నేతలను తరిమికొట్టాలని ఆయన పిలుపు ఇచ్చారు. శాసనసభలో ప్రతిపక్షం లేకుండా చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏదైన సమస్యపై ప్రతిపక్షాలు నిలదీస్తే...అవసరమైతే సభను వాయిదా వేసి, వారికి నచ్చచెప్పాల్సింది పోయి... అందరినీ బయటకు పంపించారని ఆయన విమర్శించారు.
ఈ రాజ్యానికి ఆయన చక్రవర్తి అనుకుంటున్నారని సీఎం కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా కేసీఆర్ పనిచేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ నుంచి అప్పు తీసుకువచ్చి రైతులకు రుణాలు చెల్లిస్తే ఇక్కడ సీఎం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఒక్క మంత్రి కూడా పట్టించుకోవడం లేదని రేవంత్ దయ్యబట్టారు. కేసీఆర్ 40 రోజులకుపైగా సచివాలయానికి రావడంలేదని అన్నారు. ముఖ్యమంత్రి చర్మంతో రైతులకు చెప్పుటు కుట్టించినా పాపం లేదని అన్నారు.