టార్గెట్ క్లియర్: వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి, చంద్రబాబుపైనా...
పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేశారు.
హైదరాబాద్: పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. తన లక్ష్యం స్పష్టంగా ఉందని, అది తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఎదుర్కోవడమని తన ప్రతి అడుగులోనూ చెప్పడానికి వీలుగా వ్యూహాన్ని రూపొందించుకుని అడుగులు వేశారు.
తెలుగుదేశం పార్టీపై గానీ, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై గానీ ఆయన ఏ విధమైన వ్యాఖ్యలు చేయలేదు. పోతూ పోతూ నిందలు వేశాడనే అపవాదు రాకుండా జాగ్రత్త పడ్డారు. టిడిపి తన లక్ష్యాన్ని విస్మరించింది కాబట్టే తాను పార్టీని వీడుతున్నట్లు చెప్పకనే చెప్పారు.
కెసిఆర్తో తాను పోరాటం చేస్తుంటే, కొంత మంది ఆంధ్ర మంత్రులు ఆయనతో అంటకాగుతున్నారనే విమర్శను కూడా ఆయన వ్యూహాత్మకంగానే ఎక్కుపెట్టారు. తెలంగాణలోని కొంత మంది టిడిపి నాయకులు కెసిఆర్ నుంచి తాయిలాలు తీసుకుంటున్నారని కూడా ఆయన రాజకీయ ఎత్తుగడలో భాగంగానే అన్నారు.

చంద్రబాబుపై ఇలా....
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డి పల్లెత్తు మాట కూడా అనలేదు. దుందుడుకుగా వ్యవహరిస్తారనే పేరున్న రేవంత్ రెడ్డి చాలా సంయమనంతో వ్యవహరించినట్లు కనిపిస్తున్నారు. తన ఎదుగుదలకు చంద్రబాబు సహకరించారని, ఆయనపై గౌరవం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆ రకంగా ఎదురు వర్గం తనపై విమర్సలు చేయకుండా చూసుకున్నారు.
Recommended Video


టార్గెట్ స్పష్టమని....
తెలంగాణలో తన టార్గెట్ స్పష్టంగా ఉందని ఆయన మాటల ద్వారానే కాకుండా చేతల ద్వారా కూడా చాటుకున్నారు. తన టార్గెట్ కెసిఆర్ అని ఆయన మొదటి నుంచీ చెప్పుకుంటూ వస్తున్నారు. ఆయన గద్దె దించడమే తన ప్రధాన లక్ష్యమని కూడా చెప్పుకుంటున్నారు. తన లక్ష్యానికి అవకాశం చేజారిపోతున్నందుననే తాను టిడిపిని వీడుతున్నట్లుగా కూడా ఆయన ప్రకటించుకున్నారు.

వెల్కంపై ఏమీ మాట్లాడలేదు...
తెలంగాణలో తెరాసతో తెలుగుదేశం పార్టీ చర్చలు జరుపుతున్న విషయంపై రేవంత్ రెడ్డి ఏమీ మాట్లాడలేదు. చంద్రబాబు కెసిఆర్కు దగ్గరైన విషయంపై కూడా మాట్లాడలేదు. తెలంగాణలోని కొంత మంది సీనియర్లు, ఆంధ్ర మంత్రులు కెసిఆర్కు అంటకాగుతున్నారని మాత్రమే అన్నారు. దానివల్ల టిడిపిలో ఉండి తాను కెసిఆర్పై పోరాటం చేయడం అర్థరహితమని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. స్వార్థం కోసం పార్టీ వీడుతున్నట్లు విమర్శలు రాకుండా ఆయన జాగ్రత్త పడ్డారు.

పొత్తుపై ఆయన వాదన ఇదీ....
కాంగ్రెసుతో టిడిపి పొత్తు పెట్టుకోవాలనే వైఖరిని రేవంత్ రెడ్డి మొదటి నుంచి స్పష్టంగానే వెల్లడిస్తూ వస్తున్నారు. తెలంగాణలో పార్టీలు లేవని అంటూ ఉన్నవి రెండే రెండు పక్షాలని, ఒకటి కెసిఆర్ పక్షం రెండోది కెసిఆర్ వ్యతిరేక పక్షమని ఆయన అంటున్నారు. కెసిఆర్ వ్యతిరేక పక్షాలను ఏకం చేసే పనికి కూడా తాను కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. పార్టీల వైఖరి రాష్ట్రాలను బట్టి భిన్నంగా ఉంటుందా అనేదానికి కూడా ఆయనకు స్పష్టమైన వైఖరే ఉంది. పశ్చిమ బెంగాల్, కేరళ పొత్తులను ఆయన ప్రస్తావిస్తున్నారు. మొత్తం మీద, తన లక్ష్యానికి ఉపయోగపడే కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు ఆయన చెప్పకనే చెప్పారు.












Click it and Unblock the Notifications