తెలంగాణకే అరిష్టం: కేసీఆర్ పుష్కర స్నానంపై రేవంత్ జోస్యం
హైదరాబాద్: సీఎం కేసీఆర్పై తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. కేసీఆర్ పుష్కర స్నానం చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం జరుగుతుందని అన్నారు. వేద పండితులు చెప్పినా వినకుండా కేసీఆర్ పుష్కర స్నానం చేశారని తీవ్ర స్ధాయిలో విమర్శించారు.
కేసీఆర్ వదిన చనిపోవడం వల్ల వారి కుటుంబానికి మైల ఉందని, ఇలాంటి సందర్భంలో కేసీఆర్ పుష్కర స్నానం చేయకూడదని తెలిపారు. లక్ష పాపాలు చేసిన కేసీఆర్ గోదావరి నదిలో ఒక్క మునక మునిగితే ఆ పాపాలన్నీ హరించుకుపోతాయనే భ్రమలో ఉన్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశాడు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కరీంనగర్ జిల్లా ధర్మపురి వద్ద గోదావరి పుష్కర స్నానం చేశారు. కేసీఆర్ కుటుంబ సమేతంగా స్నానమాచరించారు. కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి వద్ద గోదావరి పుష్కరాలను తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రారంభించారు.

స్వామి స్వరూపానంద ఆధ్వర్యంలో కెసిఆర్ దంపతులు పుణ్యస్నానాలు ఆచరించారు. పీఠాధిపతులతో కలిసి గోదావరి నదికి సీఎం ప్రత్యేక పూజలు చేశారు. భారీగా తరలివచ్చిన భక్తులతో పుష్కర ఘాట్లు కిటకిటలాడుతున్నాయి. పుష్కర స్నానం అనంతరం తిరిగి సీఎం కేసీఆర్ హైదరాబాద్కు చేరుకున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న గోదావరి మహా పుష్కరాలపై ఉదయం నుండి సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ, పుష్కర ఘాట్ల వద్ద పరిస్థితిని తెలుసుకుంటున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్, దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్, రెవిన్యు కార్యదర్శి మీనా, డిఐజి మల్లారెడ్డి తదితరులతో సమీక్ష నిర్వహించారు.












Click it and Unblock the Notifications