మంత్రికి రేవంత్ కౌంటర్, జగన్ను ఎదుర్కోలేకే: మంత్రి
హైదరాబాద్: ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు టీడీపీలో చేరలేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి మంత్రి జగదీశ్వర్ రెడ్డికి బుధవారం కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో వైసీపీ గుర్తు పైన గెలిచి తర్వాత టీడీపీలో చేరినట్లు స్పీకర్ వద్ద కూడా ఫిర్యాదులు లేవని తెరాస నేతలు గుర్తించాలన్నారు.
మంచిరెడ్డిపై వేటు వేయండి
తెరాసలో చేరిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి పైన అనర్హత పిటిషన్ వేయాలని సభాపతి మధుసూధనా చారిని కలిసి తెలంగాణ టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. కడియం శ్రీహరి ఓ వైపు రాష్ట్ర మంత్రిగా ఉంటూ మరోవైపు ఎంపీగా ఎలా కొనసాగుతారో చెప్పాలన్నారు.
జగన్ను ఎదుర్కోలేక: మహేందర్ రెడ్డి
ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేకే చంద్రబాబు తమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన మండిపడుతున్నారని తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు హైదరాబాదుకే పరిమితమవుతున్నారని ప్రజలు భావిస్తున్నారన్నారు. టీడీపీ నుండి మరికొంతమంది తెరాసలో చేరుతారని జోస్యం చెప్పారు.
తాను పార్టీ మారుతున్నట్లుగా లేదా కొత్త పార్టీ పెడుతున్నట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవమని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి చెప్పారు. తాను పార్టీ మారేది లేదని బుధవారం అన్నారు.
మే 9వ తేదీన బచావో తెలంగాణ మిషన్ కార్యక్రమాన్ని మొదలుపెడతామన్నారు. తెలంగాణలో అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను సందర్శిస్తామన్నారు. నాగంకు బీజేపీలో ప్రాధాన్యత లేకుండా పోయిందని, దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. వాటిని ఆయన కొట్టిపారేశారు.