పత్తిత్తుల్లా కేసీఆర్,కేటీఆర్ ల మాటలు .. ప్రజల ముందు తేల్చుకుందాం రండి : రేవంత్ రెడ్డి సవాల్
కాంగ్రెస్ పార్టీ నేత, ఫైర్ బ్రాండ్ మల్కాజిగిరి ఎంపీ ,టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పై, కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. జన్వాడలో కేటీఆర్ నిబంధనలు ఉల్లంఘించారని, అక్రమంగా ఫాంహౌస్ నిర్మిస్తున్నారని రేవంత్ రెడ్డి మరోమారు పునరుద్ఘాటించారు.జన్వాడ లో ఉన్న ఫాంహౌస్ కేటీఆర్ యజమాని కాదని బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.ఇక అంతే కాదు 2018 ఎన్నికల అఫిడవిట్లో సాక్షాత్తు కేటీఆర్ జన్వాడ అర్బన్ వెంచర్స్ పేరు మీద రెండు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లుగా ప్రకటించారని ఆయన పేర్కొన్నారు. ఇక తనకు జన్వాడ లో భూములు లేవని కేటీఆర్ చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలని మండిపడ్డారు.

జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో నిగ్గు తేల్చే పనిలో రేవంత్ రెడ్డి
సర్వే నెంబర్ 301 - 313 వరకూ తనకు ఎలాంటి భూములు లేవని కేటీఆర్ చెప్పిన మాటలు తప్పని అందుకు ఆధారాలు కూడా ఉన్నాయి అన్నారు రేవంత్ రెడ్డి. ఇక జన్వాడ ఫామ్ హౌస్ పై డ్రోన్ ఉపయోగించామన్న ఆరోపణలతో తనను జైలుకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్, కేటీఆర్ ఆస్తులకు, ప్రాణాలకు రేవంత్ రెడ్డితో ప్రమాదముందని పోలీసులతో నివేదికలు ఇప్పించారంటూ మండిపడ్డారు. కేటీఆర్ కోర్టుకు ఇచ్చిన నివేదికల్లో, ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న వివరాలను బట్టి జన్వాడ గ్రామంలో కేటీఆర్కు రెండు ప్రాంతాల్లో భూములు ఉన్నాయని వారి నివేదిక ఆధారంగానే తెలుస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

మంత్రిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ ను బర్తరఫ్ చెయ్యాలన్న రేవంత్
ఇవాళ సీఎం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ లు కల్లబొల్లి మాటలు చెప్పి, ప్రజల్ని బలి చేసి విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారని మండిపడ్డారు. పత్తిత్తుల్లా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. మంత్రిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఆ పని ఎందుకు చేయడం లేదంటూ నిలదీశారు. ఇక కేటీఆర్ తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.

నిజాయితీ నిరూపించుకోవాలని కేటీఆర్ కు రేవంత్ సవాల్
తన ఆరోపణల్లో ఏదైనా తప్పు ఉంటే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని చెప్పారు. కేటీఆర్ నిజంగా తెలంగాణ బిడ్డ అయితే బయటకొచ్చి నిజాయితీని నిరూపించుకోవాలని ప్రజల ముందు పరీక్షకు నిలబడదాం రండి అంటూ సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. ఇక తనకు, తన బావమరిది కి వట్టినాగులపల్లి లో భూమి ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. తనకు ఇరవై రెండు గంటలు, తన బావమరిది 20 గుంటల భూమి ఉందని, అక్కడ తన అక్రమ నిర్మాణాలు చేస్తున్నట్లుగా టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని, ఒకవేళ అలాంటి అక్రమ నిర్మాణాలు ఏవైనా ఉంటే గడ్డపారతో కూలగొట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని, కేటీఆర్ కూడా ఆ విధంగా అక్రమ నిర్మాణాలు కూలగొట్టడానికి రెడీనా అంటూ రేవంత్ సవాల్ విసిరారు.

సీఎం కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు .. జన్వాడ ఫామ్ హౌస్ విషయం వదిలిపెట్టని రేవంత్
సీఎం కేసీఆర్ ఉద్యమస్ఫూర్తిని, త్యాగనిరతిని, పౌరుషాన్ని ఇప్పుడు చూపించాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. అంతేకాదు కొడుకు కేటీఆర్ చేసిన అక్రమాలపై తెలంగాణ సమాజానికి సమాధానం ఇవ్వాలంటూ నిలదీశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఏం చేసినా సరే కెసిఆర్, కేటీఆర్ లపై పోరాటం సాగిస్తున్న రేవంత్ రెడ్డి జన్వాడ ఫాంహౌస్ రహస్యాలు అంటూ కేటీఆర్ ఫామ్ హౌస్ గురించి అన్ని ఆధారాలను,వివరాలను ఇచ్చి నిజాయితీని నిరూపించుకోవాలని పేర్కొన్నారు. మరి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications