గాలి కమిటీలకు వినతి పత్రాలు: రేవంత్, 'చట్ట విరుద్ధంగా జిల్లాల ఏర్పాటు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు చట్ట విరుద్ధంగా జరుగుతుందని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై శుక్రవారం ఆయన మాట్లాడారు. తెలంగాణ మేమే తెచ్చామని చెప్పుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు గాలి కమిటీలకు వినతి పత్రాలను ఇస్తున్నారన్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటు దళిత నేతలను అంతమొందించే కుట్రగా ఆయన అభివర్ణించారు. కొత్త జిల్లాల ఏర్పాటు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల మీద పెను ప్రభావం చూపిస్తుందన్నారు. దళిత, గిరిజన నాయకుల తలలు తెగగోయడానికే ఈ జిల్లాల పునర్విభజనను సీఎం కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారని రేవంత్ ధ్వజమెత్తారు.
మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసినప్పుడు అందులో స్వయంగా తానే డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహ్మాద్ అలీకి ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పానన్నారు. అసెంబ్లీ డీలిమిటేషన్కు 10 జిల్లాల ప్రాదిపదికన తీసుకోవాలని సూచించారు. ఏ ప్రాతిపదికను అసెంబ్లీ నియోజక వర్గాల పునర్ వ్యవస్థీకరణను ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు.
నియోజక వర్గాల పునర్విభజన జరిగిన తర్వాత కొత్త జిల్లా ఏర్పాటుకు చట్టం అనుమతిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అఖిల పక్ష సమావేశంలో కూడా తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్.రమణ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారన్నారు. అడ్డగోలుగా కొత్త జిల్లాల ఏర్పాటును చేయడం వల్ల ఇది రాజకీయంగా పెను ప్రభావం చూపిస్తుందని, ఇది మంచిది కాదన్నారు.
ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి, హోంశాఖకు, న్యాయశాఖకు తాను ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రస్తుతమున్న పది జిల్లాలోనే జరగాలని.. ఆ తర్వాతనే జిల్లాల విభజన జరగాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే కొత్తగా తెరపైకి వచ్చిన నాలుగు జిల్లాలు... గద్వాల్, సిరిసిల్ల, జనగామ, ఆసిఫాబాద్ డిమాండ్లపై కేకే నేతృత్వంలోని హైపవర్ కమిటీ ఇప్పటికే పరిశీలించింది. జిల్లాల ఏర్పాటుపై ప్రజలు నుంచి వినతులు, అభ్యంతరాలను స్వీకరించింది. ఈ అంశంపై కమిటీ తుది నివేదికను సిద్ధం చేస్తుంది.
మరి కాసేపట్లో సీఎం కేసీఆర్కు ఈ కమిటీ తన నివేదిక ఇవ్వనుంది. కొత్తగా తెరపైకి వచ్చిన నాలుగు జిల్లాలు... గద్వాల్, సిరిసిల్ల, జనగామ, ఆసిఫాబాద్ డిమాండ్లపై ఈ కమిటీ పరిశీలించి.. చర్చించి.. అక్టోబర్ 7వ తేదీ మధ్యాహ్నాం కల్లా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే.