ఇది ఖచ్చితంగా దశాబ్ది దగానే; కాంగ్రెస్ నాయకుల అరెస్ట్ లపై భగ్గుమన్న రేవంత్ రెడ్డి!!
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల చివరి రోజు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోగా పోలీసులు దశాబ్ది దగా పేరుతో నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలను అడ్డుకున్నారు.
కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేస్తున్నారు. కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు హాజరు కాకుండా కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు. అన్ని జిల్లాలలోనూ ఆందోళనను పోలీసులు అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులను గృహనిర్బంధం చేయడంతో టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.

దశాబ్ది దగా పేరుతో కాంగ్రెసు పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలను నిర్వహించకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులను గృహ నిర్బంధించటం అప్రజాస్వామికమని ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కోసం ప్రచారం చేస్తూ, ప్రజాధనాన్ని దుర్వినియాగం చేస్తున్న విషయం పూర్తిగా వాస్తవం అని ఆయన ఒక ప్రకటనలో అన్నారు.
ప్రజాధనాన్ని పార్టీ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయటం కచ్చితంగా దశాబ్ది దగానే అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా కెసిఆర్ అధికారం చేపట్టాక, ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ హామీ ఇచ్చి అమలు చెయ్యని వాటి గురించే తాము ప్రశ్నిస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రశ్నిస్తే నిర్బంధాలా అంటూ మండిపడ్డారు.

ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాడే హక్కు తమకు ఉండని, తమ నాయకులను అక్రమంగా ముందస్తుగా నిర్బంధిస్తున్నారనీ, వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండు చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు తమకు ఉందన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసినంత మాత్రాన ఉద్యమాన్ని ఆపలేరని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని హామీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications