తలసాని జుట్టూ మంత్రి పదవీ నకిలీ, కెసిఆర్ ముక్కు నేలకు రాయాలి: రేవంత్
మెదక్/ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మామ, అల్లుడి అరాచక పాలన నడుస్తోందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, మంత్రి హరీష్ రావులను ఉద్దేశించి అన్నారు. మంగళవారం ఆయన మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం మందపల్లిలో పర్యటించారు.
ఈ సందర్బంగా ఆ గ్రామానికి చెందిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు చెందిన నిర్వాసితులు రేవంత్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు టీడీపీ అండగా ఉంటూ పోరాడుతుందని ఆయన వారికి హామీ ఇచ్చారు. మంత్రి పదవి రాగానే హరీష్రావు రైతులను మరిచిపోయారన్నారు.

రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జుట్టే కాదు, మంత్రి పదవి కూడా నకిలీదేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తెలంగాణలో ఇసుక, లిక్కర్, మైనింగ్, ల్యాండ్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని, ఇక కొత్తగా బియ్యం మాఫియా కూడా వచ్చిందన్నారు.
ఎన్నికల ముందు అలవిగాని హామీలిచ్చిన సీఎం కేసీఆర్ సచివాలయం ముందు ముక్కు నేలకు రాయాలన్నారు. అలాగే కచరా గ్యాంగ్లో మంత్రి ఈటెల రాజేందర్ కూడా చేరిపోయారని, తెలంగాణలోని యువత తీవ్రవాదం వైపు వెళ్లే పరిస్థితులు వచ్చాయన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అస్తవ్యస్త పాలన కొనసాగుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ వైఫల్యాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు నిరాశలో కూరుకుపోతున్నారని విమర్శించారు. కరీంనగర్లో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.
ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంటే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశించిందని, ఆ అశలన్నింటినీ ప్రభుత్వం వమ్ము చేస్తోందని అన్నారు. రోజుల తరబడి ఆందోళన చేస్తున్నా ఆశా కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేందుకు ముందుకు రావడం లేదని అన్నారు. అన్ని వర్గాల్లోనూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కలుకుతుందని అన్నారు. కరీంనగర్ జిల్లాలో టిడిపికి పూర్వ వైభవం తెస్తామని చెప్పారు.
ఇదిలావుంటే, జీహెచ్ఎంసీ పరిధిలో అర్హులందరికీ ఓటుహక్కు కల్పించాలని లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు ఎల్ రమణ హెచ్చరించారు. జీహెచ్ఎంసీలో ఆరులక్షల ఓట్లను తొలగించారని, వారి వివరాలను ఈసీకి అంజేశామన్నారు. దీనిపై శుక్రవారంలోగా ఈసీ స్పందించాలని రమణ డిమాండు చేశారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, రాజకీయ జెఎసిని ఏర్పాటు చేసిన కోదండరామ్ తెలంగాణ సాధించారని ఎల్ రమణ అన్నారు. కోదండరామ్ పదవీ విరమణ సందర్భంగా సికింద్రాబాదులోని తార్నాకాలో గల ఇంటిలో కోదండరామ్ను ఆయన మంగళవారంనాడు కలిశారు. రైతాంగం కోసం ఉద్యమ సాధన చేస్తున్న అఖిల పక్ష పార్టీలకు మద్దతు తెలపాలని ఆయన కోదండరామ్ను కోరారు.












Click it and Unblock the Notifications