కూకట్పల్లి ఎమ్మెల్యేను నిలదీయండి: రేవంత్, రాజకీయ సన్యాసం: ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ అమరవీరులకు సీఎం కేసీఆర్ అన్యాయం చేశారని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కూకట్పల్లిలో రేవంత్రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది చనిపోతే 520 మందినే గుర్తించి మిగిలిన ఉద్యమకారులను ప్రభుత్వం రోడ్డున పడేసిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ అమరవీరులకు కేసీఆర్ అన్యాయం చేశారన్నారు.

అలాంటి వారికి ఓటేస్తారా అంటూ ఓటర్లను ఆయన ప్రశ్నించారు. 26 కులాలను బీసీల నుంచి తొలగించారని, తొలగించిన కులాలను బీసీల్లో చేర్చేందుకు టీఆర్ఎస్లో చేరానన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును నిలదీయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాసయాదవ్ మంత్రులయ్యారని పేర్కొన్నారు.
గెలిపించకుంటే రాజకీయ సన్యాసం: ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలిపించుకోకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు సవాల్ విసిరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీహెచ్ఎంసీకి ప్రభుత్వ సహకారం అవసరం లేదని అన్నారు.
జీహెచ్ఎంసీకి రూ.8 వేల కోట్ల నిధులున్నాయన్నారు. ఆ నిధులతో జీహెచ్ఎంసీని అభివృద్ధి చేయొచ్చని ఎర్రబెల్లి దయాకరరావు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications