ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ విభజన: రేవంత్ చేతికి పార్టీ ఆఫీసు (ఫోటోలు)
హైదరాబాద్: హైదరాబాద్లోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ను విభజించారు. ఒకటి, రెండో అంతస్తులను తెలంగాణ తెలుగుదేశం పార్టీకి (టీటీడీపీ) కేటాయించారు. తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోని టీటీడీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.
ముందుగా జూబ్లిహిల్స్ పెద్దమ్మతల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన రేవంత్ రెడ్డి అనంతరం సైకిల్పై ర్యాలీగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా చేస్తామని చెప్పిన టీఆర్ఎస్, చెత్తనగరంగా మార్చిందని విమర్శించారు.
టీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేరు
తెలంగాణలోని బీసీలు, మహిళలు, యువత, రైతులు, దళితులు, గిరిజనులకు టీడీపీ వేదికగా ఉంటుందని చెప్పిన రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదన్నారు.
99శాతం నెరవేరలేదు
ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీల్లో 99శాతం నెరవేరలేదని ఆరోపించారు. కేసీఆర్ అభివృద్ది త్రీడీ సినిమాలు, ప్రకటనలకే పరిమితమైందని ఆయన ఆరోపించారు.
కేసీఆర్ అక్రమాలను ప్రశ్నించే వేదికగా టీడీపీ
ముఖ్యమంత్రి కేసీఆర్ అక్రమాలను ప్రశ్నించే వేదికగా తెలుగుదేశం పార్టీ నిలుస్తుందని, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మార్గదర్శకత్వంలో పార్టీకి తెలంగాణకు పూర్వ వైభవం తెస్తామని ఆయన ప్రకటించారు.
టీడీపీ కృషి చేసిందని పార్టీ అధ్యక్షుడు రమణ
హైదరాబాద్లో శాంతిభద్రతల పరిరక్షణకు టీడీపీ కృషి చేసిందని పార్టీ అధ్యక్షుడు రమణ అన్నారు. కేసీఆర్ పాలనలో ఇప్పటి వరకు రెండు లక్షల కోట్ల ఖర్చు చేసామని చెప్తున్నా.. ఏ వర్గం సంక్షేమానికి ఖర్చు చేసిందో తెలియడం లేదని అన్నారు.
టీడీపీలో చేరిన ప్రదీప్ చౌదరి
ఈ సందర్భంగా జూబ్లిహిల్స్కు చెందిన ప్రదీప్ చౌదరి టీడీపీలో చేరగా.. రమణ, రేవంత్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అనుచరుడైన ప్రదీప్ చౌదరి గతంలో టీఆర్ఎస్లో చేరారు.
టీఆర్ఎస్లో ఇమడలేక పోతున్నారు: ప్రదీప్ చౌదరి
కార్యకర్త నుంచి ఎమ్మెల్యే వరకు ఎవరూ టీఆర్ఎస్లో ఇమడలేక పోతున్నారని.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదని ప్రదీప్ చౌదరి ఆరోపించారు.