ఆర్. కృష్ణయ్య సహా టిడిపి నేతలకు బాబు భరోసా: రేవత్ లెక్క తప్పుతోందా?
హైదరాబాద్: శాసనసభ్యులు ఒక్కరొక్కరే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరుతున్న నేపథ్యంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తీవ్రమైన కుదుపునకు గురైంది. ఈ స్థితిలో పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులతో శుక్రవారం విడివిడిగా మాట్లాడారు. పార్టీకి దూరంగా ఊంటూ వస్తున్న ఎల్బీ నగర్ శాసనసభ్యుడు ఆర్. కృష్ణయ్యతో కూడా ఆయన మంతనాలు జరిపారు.
వారికి చంద్రబాబు ధైర్యవచనాలు చెప్పే ప్రయత్నం చేశారు. బెదిరింపులకు భయపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని ఆయన చెప్పారు. ప్రజలు మనతోనే ఉన్నారని, మనం ప్రజలో ఉంటే చాలునని ఆయన అన్నారు. ఈ నెల 17వ తేదీన తెలంగాణ టీడిపి నేతలతోనూ పోలిట్ బ్యూరో సభ్యులతోనూ చంద్రబాబు సమావేశం కానున్నారు. తెలంగాణలో టిడిపిని తిరిగి పట్టాలపైకి ఎక్కించడానికి ఆయన ఆ సమావేశం ద్వారా కసరత్తు చేస్తారని అంటున్నారు.
కాగా, తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం, తాను ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం అనే విషయాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చురుకైన పాత్ర నిర్వహిస్తూ టిడిపిఎల్పీ నాయకత్వ బాధ్యతను కూడా తీసుకున్న రేవంత్ రెడ్డి లెక్క తప్పుతున్నట్లు కనిపిస్తోంది. గత కొద్ది కాలంగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే చంద్రబాబు రేవంత్ రెడ్డికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది.
దాంతో పార్టీలోని సీనియర్లు ఆయన ధాటికి తట్టుకోలేక, ఆయన వెంట నడవలేక సతమవుతున్నట్లు అర్థమవుతోంది. నారా లోకేష్ కూడా రేవంత్ రెడ్డినే నమ్ముకున్నట్లు కనిపిస్తున్నారు. తెలంగాణలో కుల సమీకరణాలు కుదురుకుంటాయని, వెలమ వర్సెస్ రెడ్డి సమరం సాగుతోందని, ఇది పూర్తి స్థాయిలో కుదురుకుంటే తాను రెడ్డి సామాజిక వర్గం నుంచి తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి జరిగే పోరులో తాను ముందుంటానని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన చాలా కాలం క్రితం ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు.
ఎర్రబెల్లి దయాకర్ రావు తెరాసలో చేరడాన్ని కూడా ఆ వైఖరితోనే ఆయన వ్యాఖ్యానించారు. అయితే, వెలమ కులానికి చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు మాత్రమే కాకుండా రెడ్డి, బీసీ వర్గాలకు చెందిన శాసనసభ్యులు కూడా తెరాసలో చేరారనే విషయాన్ని ఆయన పరిగణనలోకి తీసుకున్నారా, లేదా అనేది అనుమానంగా ఉంది.
ఒక వేళ, ఆధిపత్య కులాలైన రెడ్డి, వెలమలు అధికారం కోసం సాగించే పోరాటంలో మిగతా సామాజిక వర్గాలు ఏ వైపు కుదురుకుంటాయనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుందనేది ఆయన గుర్తించినట్లు లేదు. పైగా, కుల సమీకరణాలు రాజకీయాల్లో సహజమే అని అనుకున్నప్పటికీ వాటిని నాయకులు ఎవరూ బయటపెట్టారు. అందుకు అనుగుణంగా తమ రాజకీయాలను మలుచుకుంటారు తప్ప కుల సమీకరణాల ద్వారా తాము అధిపత్యంలోకి లేదా అధికారంలోకి వస్తామని చెప్పుకోరు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే చూస్తే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుల సమీకరణాలను బట్టే రాజకీయాలు నడుపుతున్నారని అనుకున్నా వారు తాము కులసమీకరణాల ఆధారంగా అధికారంలోకి వస్తామని చెప్పుకున్న సందర్భాలు లేవు. కులాలకు అతీతంగా ఉండాలనే చెబుతుంటారు. అందువల్ల తెలంగాణలో రేవంత్ రెడ్డి లెక్క తప్పడానికే ఎక్కువ అవకాశాలున్నాయని అంటున్నారు.
నిజానికి, రెడ్డి సామాజికవర్గమైన రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో నాయకుడిగా అంగీకరిస్తుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెసు పార్టీ రెడ్డి సామాజిక వర్గ ఆధిపత్యంలో ఉందని అనుకుంటే, ఆ పార్టీలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరిస్తారా అని కూడా ప్రశ్నించుకోవాలి. కాంగ్రెసులోని రెడ్డి సామాజిక వర్గంలోని నాయకులు తక్కువలో తక్కువ అరడజను మంది ముఖ్యమంత్రి పదవికి పోటీ పడేవారుంటారు. అందువల్ల రేవంత్ రెడ్డి ఏదో తాను కుల సమీకరణాల కారణంగా ముఖ్యమంత్రిని అవుతానని అనుకుంటే భ్రమగానే మిగిలిపోవచ్చు.
రేవంత్ రెడ్డి చెప్పినట్లు రాజకీయాల్లో కుల సమీకరణాలు జరుగుతాయని భావించినా అలాంటి సమీకరణాలు బయటకు కనిపించే స్థితిలో గానీ పైపై స్థాయిలో గానీ ఉండవు. నాయకుడనే వ్యక్తి వాటి లోతులను అర్థం చేసుకుని అన్ని వర్గాల లేదా సామాజిక వర్గాల నాయకుడిగా వ్యూహాత్మకంగా ముందుకు రావాల్సి ఉంటుంది. ఆ వ్యూహమే రేవంత్ రెడ్డి వద్ద కొరవడినట్లు కనిపిస్తోంది.