కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రగడ: కేసీఆర్ స్పందించాలి: రేవంత్ రెడ్డి లేఖ!!
టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డి మునిసిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. గ్రామ సభలు పెట్టకుండా రైతులు అభిప్రాయం తీసుకోకుండా కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఎలా అమలు చేస్తారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

రైతులను కేసీఆర్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది
కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ లో భాగంగా రైతుల పొలాలను ఇండస్ట్రియల్ జోన్ కు వాడుకోవడం వల్ల చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతారని, దీనికి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అదే బాధ్యత అని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. నెల రోజులుగా రైతులు మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని ధర్నాలు చేస్తున్నా సర్కారు స్పందించకపోవడం దారుణమని, రైతులను కేసీఆర్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల పొలాలను పారిశ్రామిక వాడల కింద గుర్తించడాన్ని తప్పుపట్టారు రేవంత్ రెడ్డి.

ప్రభుత్వ తీరు వల్లే రైతు ఆత్మహత్య
అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో పయ్యావుల రాములు అనే రైతు ప్రభుత్వ తీరు వల్లే ఆత్మహత్య చేసుకున్నారని, అది అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డిలో రైతులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటిస్తుందని ఆయన తెలిపారు. ఇక ఈ విషయంపై ఆయన సీఎం కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖలో సీఎం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వెంటనే కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, అతని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

ప్రజా సభలో రైతుల ముందు చర్చించిన తర్వాతే మాస్టర్ ప్లాన్
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రైతుల ముందు పెట్టాలని, ప్రజల సమక్షంలో, ప్రజా సభల్లో చర్చించిన తర్వాత అమలు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ల వద్ద రైతులకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్న రేవంత్ రెడ్డి కామారెడ్డి కలెక్టర్ తీరును తప్పు పట్టారు. రైతులు వినతిపత్రం ఇవ్వడానికి వస్తే కలెక్టర్ కనీసం రైతులతో మాట్లాడడానికి కూడా నిరాకరించడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.

కలెక్టరేట్ లో జరిగిన సంఘటనలు బాధించాయి
ప్రజల పట్ల పాలకులకు ఉన్న నియంత ధోరణికి ఇది పరాకాష్ట అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతులు తమ డిమాండ్ల సాధన కోసం, ప్రాణ సమానమైన భూములను కాపాడుకోవడం కోసం కలెక్టరేట్ కు వస్తే అక్కడ జరిగిన పరిణామాలు బాధించాయి అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ఈ విషయంలో రైతుల సమస్యలను పరిష్కరించేలా, మాస్టర్ ప్లాన్ ముసాయిదాను మార్చుకునేలా నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.












Click it and Unblock the Notifications