తెలంగాణా ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ!!
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఈ బహిరంగ లేఖలో ఆయన అధికార బి ఆర్ ఎస్ పైన, బిజెపి పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో ప్రజల కర్తవ్యాన్ని తన లేఖ ద్వారా స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి బిజెపి, బీఆర్ఎస్ లు కుమ్మక్కు రాజకీయాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయని, కాంగ్రెస్ నేతల ఇళ్లపై దాడులు చేయిస్తున్నాయి అని పేర్కొన్నారు. అత్యున్నత ప్రభుత్వ సంస్థలను, రాజ్యాంగబద్ధ వ్యవస్థలను కెసిఆర్, మోడీ రాజకీయ క్రీడలో పావులుగా మార్చారని మండిపడ్డారు. ఆ రెండు పార్టీలలో చేరిన వారు పవిత్రులు, మిగతా పార్టీలలో ఉన్నవారు ద్రోహులా అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదని, ప్రశ్నించే గొంతులు లేకుండా చెయ్యాలని చూస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇది బిజెపి, బి ఆర్ ఎస్ మధ్య కుదిరిన కామన్ మినిమం ప్రోగ్రాం అంటూ రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కేవలం కాంగ్రెస్ నాయకులే టార్గెట్ గా ఈడీ, ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయని ఆయన ప్రశ్నించారు. వీటి వెనుక ఉన్న అదృశ్యహస్తాలు ఎవరివో అందరికీ తెలుసని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కేవలం కాంగ్రెస్ నేతలను వేధించటం కోసమే ఈ తరహా దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కు విజయ అవకాశాలు పెరుగుతున్న క్రమంలో ఈ డి, ఐటి దాడులు పెరుగుతున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మీ పార్టీలో ఉన్నప్పుడు కనిపించని పన్ను ఎగవేతలు కాంగ్రెస్ పార్టీలో చేరగానే కనిపిస్తున్నాయా అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
అమిత్ షా, కెసిఆర్ ఈడి, ఐటి దాడులకు ప్రణాళికలు రచించడం, వాటిని కేటీఆర్, పియూష్ గోయల్ అమలు చేయడం జరుగుతుందని అసహనం వ్యక్తం చేశారు. పోటీ చేసే అభ్యర్థుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంటుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
బిజెపి, బీఆర్ఎస్ లకు హెచ్చరికలు జారీ చేస్తున్నారని పేర్కొన్న రేవంత్ రెడ్డి మీ పతనం మొదలైంది.. మీకు క్షుద్ర రాజకీయాలకు కాలం చెల్లింది అంటూ విరుచుకుపడ్డారు .మీ కవ్వింపు చర్యలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో మరింత కసిని పెంచాయని ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా మరిన్ని దాడులు చేసినా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుని ఎవరూ ఆపలేరని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications