తిరుగుబాటు: చంద్రబాబుపై నమ్మకమే రేవంత్ రెడ్డిని దెబ్బ తీసిందా?
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితోనే తేల్చుకుంటానని, అన్ని ప్రశ్నలకు చంద్రబాబుకే జవాబులు చెప్తానని తెలుగుదేశం పార్టీ తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు.
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితోనే తేల్చుకుంటానని, అన్ని ప్రశ్నలకు చంద్రబాబుకే జవాబులు చెప్తానని తెలుగుదేశం పార్టీ తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో మోత్కుపల్లి నర్సింహులకు వేసిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన జవాబు ఇదే.
Recommended Video
అయితే, చంద్రబాబుకే జవాబుదారీని అని చెబుకుంటున్న రేవంత్ రెడ్డి అసలు వ్యూహం వేరేగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన చంద్రబాబుపైనే తిరుగుబాటు ప్రకటించినట్లుగా భావిస్తున్నారు. చంద్రబాబు అనుమతితోనే మిగతా నాయకులంతా ఆయనపై విమర్శలు చేస్తున్నారని అనుకుంటున్నారు.
చంద్రబాబుకు నో చాన్స్: వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి రాజీనామా?
చంద్రబాబుపై ఉంచిన అపారమైన విశ్వాసమే రేవంత్ రెడ్డిని దెబ్బ తీసినట్లుగా భావిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర రావుపై పోరాటం చేయడానికి ఆయన గట్టి నమ్మకంతో ఉన్నట్లు కనిపిస్తూ వచ్చారు.
గతంలో ఇలా....
తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని, పార్టీ బలోపేత అవుతుందని రేవంత్ రెడ్డి 2016 జులైలో ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. చంద్రబాబు తనపై అపారమైన విశ్వాసం ఉంచినట్లుగా, తాను కూడా చంద్రబాబుపై విశ్వాసంతో ఉన్నట్లుగా ఆయన చెప్పిన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ, చంద్రబాబు తన వైఖరిని మార్చుకోవడం వల్లనే రేవంత్ రెడ్డి తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితిలో పడ్డారనేది అర్థమవుతోంది.
చంద్రబాబు ఇలా.....
చంద్రబాబు తెలంగాణలో పార్టీని వదిలిపెట్టబోరని, కెసిఆర్తో పోరాటం చేస్తారని, కనీసం పోరాటం చేయడానికి అనుమతి ఇస్తారని రేవంత్ రెడ్డి భావించారని చెప్పడానికి తగిన ప్రాతిపదిక కూడా ఉంది. అయితే, చంద్రబాబు పూర్తిగా తన వైఖరిని మార్చుకున్నట్లు ఇటీవలి పరిణామాలు తెలియజేస్తున్నాయి. కెసిఆర్తో స్నేహాన్ని ఆయన మరింత పటిష్టం చేసుకోవడానికి చూస్తున్నారని, కెసిఆర్ వెల్కం వ్యూహానికి కూడా చంద్రబాబు అనుమతి ఉందని భావించడంతో రేవంత్ రెడ్డి టిడిపిని వదిలిపెట్టాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
చాలా కాలంగా చర్చలు....
కాంగ్రెసుతో కలిసి పనిచేయడానికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. ప్రతిపక్షాలను అన్నింటినీ ఏకతాటి మీదికి తేవడానికి ఆయన చర్చలు సాగిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. కాంగ్రెసుతో కలిసి పోటీ చేయడం లేదా ప్రతిపక్షాలన్నీ ఏకమై కెసిఆర్కు వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడమనే విషయం ఇంకా ద్రవరూపంలోనే ఉందని రేవంత్ రెడ్డి 2016 జులై ఇంటర్వ్యూలో చెప్పారు.
రేవంత్ రెడ్డి చర్చలు చంద్రబాబుకు తెలియవా....
కాంగ్రెసుతో రేవంత్ రెడ్డి జరుపుతున్న చర్చల గురించి చంద్రబాబుకు తెలియదని చెప్పలేం. చంద్రబాబుకు తెలిసే రేవంత్ రెడ్డి చర్చలు జరిపారని కూడా అనుకోవాల్సి ఉంటుంది. అయితే, చర్చలు ఓ కొలిక్కి వచ్చి, కెసిఆర్కు వ్యతిరేకంగా కాంగ్రెసుతో పొత్తు పెట్టుకునే విషయం తేలే సమయంలో కెసిఆర్ వెల్కం వ్యూహానికి తెర తీశారని అంటున్నారు. దాంతో రేవంత్ రెడ్డి తిరుగుబాటుకు సిద్దపడ్డారని అంటున్నారు.