రేవంత్ కుటుంబంలో విషాదం: వెంటనే ఖమ్మం నుంచి తిరుగుపయనం
తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కుటుంబంలో విషాద ఘటన చోటు చేసుకుంది. రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి కుమార్తె మృతి చెందారు.
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కుటుంబంలో విషాద ఘటన చోటు చేసుకుంది. రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి కుమార్తె మృతి చెందారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న రేవంత్ విషయం తెలిసిన వెంటనే తిరుగుపయనమయ్యారు.
శుక్రవారం ఖమ్మం జిల్లా మార్కెట్టు యార్డులో గిట్టుబాటు ధర లభించడం లేదంటూ రైతులు విధ్వంసానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మార్కెట్ యార్డులోని పలు వస్తువులను కూడా రైతులు తగులబెట్టారు. ఈ నేపథ్యంలో వారిపై లాఠీ ఛార్జీ కూడా చేయాల్సి వచ్చింది.
అయితే, తీవ్ర ఆందోళనలో ఉన్న సదరు రైతులను పరామర్శించడానికి టీడీపీ నేత రేవంత్ రెడ్డి శనివారం ఖమ్మం జిల్లాకు వెళ్లారు. అయితే, అదే సమయంలో తన సోదరుడు తిరుపతి రెడ్డి కుమార్తె మృతి చెందిందన్న వార్త తెలియడంతో రేవంత్ రెడ్డి మళ్లీ ఖమ్మం నుంచి వెనుతిరిగారు. అయితే, తిరుపతి రెడ్డి కుమార్తె మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.