తెలంగాణలో రేవంత్ రెడ్డి టీమ్ సర్వే?-ఆ అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ-భవిష్యత్ కార్యాచరణ కోసమే...
టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఆ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. అప్పటిదాకా ఢీలా పడ్డ పార్టీ శ్రేణులు రేవంత్ నాయకత్వంలో దూకుడు పెంచారు. ప్రస్తుతం దళిత గిరిజన దండోరా సభలతో రేవంత్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సభలకు జనం కూడా భారీ ఎత్తున తరలివస్తున్నారు.దీంతో 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే ఆశలు ఆ పార్టీ నాయకుల్లో పెరుగుతున్నాయి. అయితే పైపైన చూస్తే రేవంత్ నాయకత్వ జోష్ బాగానే కనిపిస్తున్నప్పటికీ... గ్రౌండ్ లెవల్లో ఆయన ప్రభావమెంత అనేది అసలు చర్చ. ఇదే విషయాన్ని తెలుసుకునేందుకు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఓ సర్వే చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది.

సర్వేలో ఏయే అంశాలు...
తన నాయకత్వ ప్రభావంతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న సామాజిక,ఆర్థిక,రాజకీయ పరిస్థితులు.. ప్రజల మూడ్ను తెలుసుకునేందుకు రేవంత్ రెడ్డి ఈ సర్వే చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రజలు తన నాయకత్వాన్ని ఎంతమేర స్వాగతిస్తున్నారు... తాను నాయకత్వ పగ్గాలు చేపట్టాక పార్టీ పట్ల ప్రజల అభిప్రాయం ఎలా ఉంది వంటి వివరాలు కూడా సర్వే ద్వారా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే టీఆర్ఎస్,బీజేపీలపై ప్రజల అభిప్రాయాలు... రాష్ట్రంలో,కేంద్రంలో ఈ రెండు పార్టీల పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారనే వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన కొన్ని సర్వే ఏజెన్సీల ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో ఈ సర్వే మొదలుపెట్టినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సర్వేతో ఒక అంచనాకు...
ఈ సర్వే ఆధారంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాలు తీసుకుని ముందుకెళ్లాలనే దానిపై రేవంత్ రూట్ మ్యాప్ రూపొందించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏ అంశాల్లో తాను ఇంకా మెరుగవాల్సి ఉంది.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కార్యక్రమాలు తీసుకునే క్రమంలో పార్టీని ఎలా తీర్చిదిద్దాలి... వంటి అంశాలపై రేవంత్ ఫోకస్ చేసే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేవంత్ తలపెట్టే పాదయాత్రకు ఈ సర్వే సమాచారం ఒక ఫీడ్ బ్యాక్లా ఉపయోగపడవచ్చుననే వాదన వినిపిస్తోంది.

ఆగని సొంత నేతల విమర్శలు...
మరోవైపు రేవంత్ రెడ్డి నాయకత్వంపై సొంత పార్టీ నుంచి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మొదట్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ నాయకత్వంపై బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. తాజాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేవంత్ వైఖరిని తప్పు పట్టారు.గజ్వేల్లో సభ పెట్టాలన్న రేవంత్ నిర్ణయాన్ని ఆయన తప్పు పట్టారు.ఓవైపు హుజురాబాద్ ఉపఎన్నిక పెట్టుకుని ఇతర నియోజకవర్గాల్లో సభలేంటని... ఇందులో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. దళిత, గిరిజన ఆత్మగౌరవం పేరిట నిర్వహిస్తున్న సభలన్నీ రేవంత్రెడ్డి వ్యక్తిగత భజన సభలుగా మారాయని విమర్శించారు.శనివారం(సెప్టెంబర్ 11) జరిగిన పొలిటికల్ అఫైర్స్ జూమ్ మీటింగ్కు జగ్గారెడ్డి గైర్హాజరయ్యారు. తన మాటకు విలువే లేనప్పుడు... ఇక తాను మీటింగ్కు ఎందుకు వెళ్లాలని అన్నారు.

మొదటి నుంచి సీనియర్లతో కుదరని సఖ్యత..
రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి దక్కకుండా సీనియర్లు ఎంతలా ప్రయత్నించారో అందరికీ తెలిసిందే. ఆయనకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే ఇక తమకు ప్రాధాన్యం ఉండదని వాపోయారు. సీనియర్లను పక్కనపెడుతాడని... తన కోటరీకే ప్రాధాన్యం ఇస్తాడని అధిష్టానానికి చెప్పారు. కాంగ్రెస్ ఆ నిర్ణయం తీసుకుంటే రాజీనామాలు తప్పవని కూడా హెచ్చరించారు. ఈ కారణంగా సుదీర్ఘ కాలం టీపీసీసీ చీఫ్ ఎంపిక వాయిదాపడ్డ సంగతి తెలిసిందే. సీనియర్లు విభేదించినప్పటికీ రెండు నెలల క్రితం కాంగ్రెస్ అధిష్టానం రేవంత్కే పగ్గాలు అప్పగించింది. రేవంత్ నాయకత్వంపై మొదట కోమటిరెడ్డి బహిరంగంగానే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్కు డబ్బులిచ్చి పదవి కొనుక్కున్నారని ఆరోపించారు. ఇటీవల ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రేవంత్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారనే వార్తలు వచ్చాయి. సీనియర్లను పక్కనపెడుతున్నారని... అందరినీ కలుపుకువెళ్లడం లేదని ఆయన మాణిక్కం ఠాగూర్కు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయంలో మాణిక్కం ఠాగూర్కు ఉత్తమ్ నచ్చజెప్పినట్లు తెలుస్తోంది.
Recommended Video

దుబ్బాక సంగతేంటి...
దుబ్బాక ఉపఎన్నిక విషయంలో కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఉపఎన్నికకు ఇంకా చాలా సమయం ఉందని మల్లు రవి లాంటి సీనియర్ నేతలు అంటుంటే... ఎందుకీ తాత్సారమని కోమటిరెడ్డి,జగ్గారెడ్డి లాంటి నేతలు నిలదీస్తున్నారు. 'హుజురాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైంది. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన ఎప్పుడెప్పుడా అని కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. వెంటనే అభ్యర్థిని ప్రకటించి హుజురాబాద్ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేయాలి.' అని కొద్ది వారాల క్రితం కోమటిరెడ్డి సూచించారు. తాజాగా జగ్గారెడ్డి కూడా ఇదే సూచన చేశారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పట్లో హుజురాబాద్పై ఫోకస్ చేసే సూచనలు కనిపించట్లేదనే వాదన వినిపిస్తోంది. హుజురాబాద్ ఉపఎన్నికను ఆయన లైట్ తీసుకుంటున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మొదట పలువురి పేర్లు వినిపించగా... చివరకు కొండా సురేఖ పేరు ఖరారు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇంతలోనే అభ్యర్థి ఎంపికకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామనే ప్రకటన చేశారు. ఇప్పటికే కొంతమంది దరఖాస్తు కూడా చేసుకున్నారు.ఈ విషయంలోనూ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.ఓవైపు టీఆర్ఎస్,బీజేపీ హుజురాబాద్లో కొద్ది నెలలుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం అడపాదడపా అటువైపు వెళ్లడం తప్పితే పెద్దగా ఫోకస్ చేసినట్లు కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications