భువనేశ్వరి వద్దకు రేవంత్ సతీమణి: ఆరా తీసిన లోకేష్, ధైర్యం
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొడంగల్ శాసన సభ్యుడు, యువనేత రేవంత్ రెడ్డి సతీమణి గీత బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని, తనయుడు నారా లోకేష్ను కలిశారు.
తన తనయ నైమిషా రెడ్డి నిశ్చితార్థానికి వారిని గీత ఆహ్వానించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి, లోకేష్లు నిశ్చితార్థానికి జరుగుతున్న ఏర్పాట్ల పైన గీత నుండి ఆరా తీశారు.
ఈ సందర్భంగా వారు గీతకు ధైర్యం చెప్పారు. ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టైన రేవంత్ రెడ్డికి పార్టీ, తమ కుటుంబం అండగా ఉంటుందని చెప్పారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. అధైర్యపడకూడదని ఆమెకు సూచించారు.
కాగా, గురువారం నాడు రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి నిశ్చితార్థం జరగనుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ కేబినెట్, టీడీపీ నేతలు, చంద్రబాబు కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు.
ఓటుకు నోటు వ్యవహారం నేపథ్యంలో రేవంత్ రెడ్డికి అండగా నిలుస్తున్నామని భరోసా ఇచ్చేందుకు ఏపీ మంత్రులు, నేతలు, తెలంగాణ టీడీపీ ముఖ్యులు, చంద్రబాబు కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. మరోవైపు, కూతురు నిశ్చితార్థానికి రేవంత్ రెడ్డికి మధ్యంతర బెయిల్ వచ్చింది.