నేనే కాదు చంద్రబాబు ఆపలేరు, నన్ను చేర్చుకునే ధైర్యం లేదు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ఉన్నా, నేను ఉన్నా, నారా లోకేష్ ఉన్నా.. అమ్ముడు పోయే వాళ్లు ఉంటే ఆపలేమని తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు అన్నారు. ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
తాను ఎట్టి పరిస్థితుల్లోను పార్టీ మారనని చెప్పారు. తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని చెప్పారు. తనకు గోడ దూకే ఆలోచన లేదన్నారు. తనను చేర్చుకునే బలం, ధైర్యం ఎవరికి లేవన్నారు. తద్వారా తాను టిడిపిని వదలనను అభిప్రాయపడ్డారు. తాను జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా స్వతంత్రంగా గెలిచానన్నారు. 2014లో టిడిపి నుంచి గెలిచానని చెప్పారు.
ఓటుకు నోటు కేసు వెలుగు చూసినప్పటి నుంచే ఎమ్మెల్యేలు అధికార తెరాసలోచేరుతున్నారన్న వార్తల పైన రేవంత్ స్పందించారు. అలాంటిదేమీ లేదన్నాడు. నాడు చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా పలువురు వైసిపిలో చేరారన్నారు. ఓటుకు నోటు కంటే ముందే కొందరు కారు ఎక్కారని చెప్పారు. చంద్రబాబు ఉన్నా, నారా లోకేష్ ఉన్నా, నేను ఉన్నా అమ్ముడు పోవాలనుకునే వారు ఉంటే వెళ్తారన్నారు.
చంద్రబాబు తెలంగాణను వదిలేశారనడంపై..
చంద్రబాబు నాయుడు తెలంగాణను వదిలేసి వెళ్లారనే విమర్శల పైన రేవంత్ స్పందించారు. ఆయన ఓ పార్టీ అధినేత అన్నారు. తెలంగాణలో బీజేపీని గెలిపించాలంటే నరేంద్ర మోడీ రారని, అలాగే కాంగ్రెస్ను గెలిపించేందుకు సోనియా గాంధీ రారన్నారు. అలాగే చంద్రబాబు కూడా ఓ పార్టీ అధినేత అన్నారు.
వైయస్ జగన్ పైన ఆగ్రహం
ఓటుకు నోటు కేసును పదే పదే ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొనడంపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఓటుకు నోటు పేరుతో బతకవచ్చునని తమ పార్టీ పైన విషప్రచారం చేస్తున్నారన్నారు. సర్వేలలో కేసీఆర్ ముందుండటంపై మాట్లాడుతూ... ఆయనను సంతోషపెట్టేందుకు కొందరు అలా చేస్తున్నారన్నారు.