కేసీఆర్ బంధువు కోసమే 'నకిలీ', ఆ అధికారిని పంపించారు: రేవంత్ సంచలనం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బంధువు కంపెనీ కోసమే నకిలీలను కాపాడుతున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో మంత్రులే నకిలీలు ఉంటే నకిలీ విత్తనాలు ఉండవా అని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో 2600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోతే కేసీఆర్ మాత్రం రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పడం విడ్డూరమన్నారు. ఎనిమిది కంపెనీల విత్తనాలు నకిలీవని తేల్చిన అధికారిని సెలవులో పంపించలేదా అని నిలదీశారు.
కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరు సంతోషంగా లేరన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారన్నారు. వరంగల్ అర్బన్ కలెక్టరేట్ వద్ద గురువారం నాడు రైతులకు సంఘీభావంగా టిటిడిపి నేతలు గురువారం దీక్షకు దిగారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసే కంపెనీలపై చర్యలు తీసుకోకుండా కేసీఆర్ అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చారని రేవంత్ ఈ సందర్భంగా ఆరోపించారు.
జిల్లాల ఏర్పాటులో శాస్త్రీయత లేదు
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో శాస్త్రీయత లోపించిందని తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ముసాయిదా నోటిఫికేషన్లో 27 జిల్లాలకే ప్రకటన జారీచేసిన ప్రభుత్వం చివరిరోజు తుది నోటిఫికేషన్లో 31 జిల్లాలు పొందుపర్చి ఆర్డినెన్స్ ఎలా జారీ చేసిందని ప్రశ్నించారు.
ఈ విధానం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రతిపక్షాల అభిప్రాయాలను తుంగలో తొక్కి ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్స్ చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.
నిరుద్యోగులకు ఉపాధి కల్పన పథకాలు సైతం నత్తనడకన సాగుతున్నాయన్నారు. మిగులు బడ్జెట్తో ఏర్పాటైన రాష్ట్రం, ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి ఉత్పన్నం అవుతోందని ఆయన మండిపడ్డారు.