చిల్లర పార్టీలు కాంగ్రెస్ కు పోటీ కాదు .. ఆ పార్టీల్లో సగం బ్రోకర్లు, సగం లోఫర్లు : సభ్యత్వాల నమోదుపై రేవంత్
తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావటానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రయత్నాలు సాగిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ మెంబర్ షిప్ డ్రైవ్ చేపట్టాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గొప్పతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, భారీగా సభ్యత్వాలు చెయ్యాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు

కాంగ్రెస్ పార్టీ తో చిల్లర పార్టీలు పోటీ కావు
తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షలకు పైగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలు చేయాలని టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని చెప్పిన రేవంత్ రెడ్డి అన్ని వర్గాల రక్షణకు పోరాడుతున్న అగ్రనేత రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చిల్లర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కు పోటీ కాదని చెప్పిన రేవంత్ రెడ్డి తెల్ల దొరల నుంచి దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ కాంగ్రెస్ పార్టీ ఘనతను చెప్పుకొచ్చారు.

ఇతర పార్టీలలో సగం బ్రోకర్లు, సగం లోఫర్లు
ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబ నాయకత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ అని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి ఇతర పార్టీల నాయకత్వంలో సగం బ్రోకర్లు, సగం లోఫర్లు ఉన్నారని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారని, రాజభరణాలు రద్దు చేశారని, బ్యాంకులు జాతీయం చేశారని, మహిళలకు రిజర్వేషన్ ఇచ్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించింది రాజీవ్ గాంధీ అని పేర్కొన్న రేవంత్ రెడ్డి ఐటీని అభివృద్ధి చేసి కంప్యూటర్ ను, సెల్ ఫోన్ ను అందరికీ పరిచయం చేసింది రాజీవ్ గాంధీ అంటూ వెల్లడించారు.

కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుంటే 2 లక్షల భీమా
కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు గాంధీభవన్లో కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించిన కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి పార్టీ గొప్పతనాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి సభ్యత్వం చేయాలని పేర్కొన్నారు. ఈ నెల 9, 10 తేదీల్లో జిల్లా, మండల అధ్యక్షుల శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామని, 14 నుండి 21 వరకు గ్రామాలలో కాంగ్రెస్ జన జాగరణ యాత్రలు చేపట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. డిసెంబర్ 9న పెరేడ్ గ్రౌండ్ లో రాహుల్ గాంధీతో కలిసి భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు

రాష్ట్రంలో 30 లక్షలకు పైగా సభ్యత్వాల లక్ష్యం నిర్దేశించిన రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వం చేస్తామని సోనియాగాంధీకి మాట ఇచ్చామని ఆ మాటను నిలబెట్టుకునే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీద ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి బూతులో వందమంది సభ్యత్వంతో మొత్తం 34 వేల బూతుల్లో 30 లక్షల మంది సభ్యత్వాన్ని నమోదు చేయాలని రేవంత్ రెడ్డి లక్ష్యాన్ని నిర్దేశించారు. వరి కొనకుండా ప్రభుత్వం రైతులను ఉరికి ఉసిగొల్పుతోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహేష్ అనే నిరుద్యోగి లేఖ రాసి చనిపోయాడని రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవని రేవంత్ అసహనం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం అంటేనే ఒక గౌరవం అన్న భట్టి విక్రమార్క
మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాల విషయంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం అంటే ఒక గౌరవం అని ఆయన అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చిన దేశ అభివృద్ధికి పాటుపడిన అని పేర్కొన్న ఆయన పెద్ద ఎత్తున సభ్యత్వాలను చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మణికంఠా తో పాటు సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, వి హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు












Click it and Unblock the Notifications