రేవంత్ రెడ్డి వ్యూహం.. మళ్ళీ రాహుల్ గాంధీ రంగంలోకి; ఈసారి టార్గెట్ రాజన్నసిరిసిల్ల జిల్లా!!
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గద్దె దించడం కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీని తెలంగాణ రాష్ట్రానికి తీసుకువచ్చి రైతు డిక్లరేషన్ ప్రకటింపజేసిన రేవంత్ రెడ్డి, మరోమారు రాహుల్ గాంధీని తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారు. గతంలో రాహుల్ గాంధీ వచ్చినప్పుడు వరంగల్ జిల్లా ను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి, ఈసారి రాజన్న సిరిసిల్ల జిల్లాను టార్గెట్ చేయనున్నారు.

రేవంత్ రెడ్డి వ్యూహం ... తెలంగాణాకు మళ్ళీ రాహుల్ గాంధీ
తెలంగాణ రాష్ట్రంలో పట్టు సాధించడం కోసం, వచ్చే ఎన్నికలు లక్ష్యంగా ఇప్పటినుంచే రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఎన్నికల ముందు మేనిఫెస్టో ప్రకటించడం కంటే, ఇప్పటి నుంచే తాను చేయదలచుకున్న అంశాలను వర్గాల వారీగా డిక్లరేషన్లు ప్రకటించి, వాటిని ప్రజల్లో చర్చ పెడితే ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు వరంగల్ జిల్లాలో బహిరంగ సభ ఏర్పాటు చేసి రైతు డిక్లరేషన్ ను ప్రకటింపజేశారు. అప్పుడు రాహుల్ గాంధీ తెలంగాణ కు వచ్చినప్పుడు ప్రజలపై ఆ ఇంపాక్ట్ చాలా ఉందన్నది రాజకీయ వర్గాల్లో జోరుగా జరిగిన చర్చ.

టీఆర్ఎస్ కు చెక్ పెట్టేలా నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించే ఛాన్స్
రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించిన తర్వాత, దానిపై రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో రైతు డిక్లరేషన్ పై అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇక మే నెలలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన రాహుల్ గాంధీ మళ్లీ త్వరలో తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. టిఆర్ఎస్ పార్టీ ని గద్దె దించడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ ఈసారి నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. తెలంగాణ సర్కార్ పై రైతులతో పాటు, నిరుద్యోగులు తీవ్ర అసహనంతో ఉన్నవేళ నిరుద్యోగ డిక్లరేషన్ ను ప్రకటింపజేసి రేవంత్ రెడ్డి మరో కీలక అడుగు ముందుకు వేయనున్నారని సమాచారం.

రాజన్న సిరిసిల్ల జిల్లాను టార్గెట్ చెయ్యనున్న రేవంత్ రెడ్డి
అయితే ఈసారి మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే రాజన్న సిరిసిల్ల జిల్లా ను టార్గెట్ చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటిస్తే నిరుద్యోగ యువత మద్దతు కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణరాష్ట్రంలో ఇటీవల ప్రధాని మోడీ భారీ బహిరంగ సభ విజయవంతం కావడంతో బిజెపి దూకుడును కొనసాగిస్తోంది. ఈ సమయంలో మరొకసారి తెలంగాణ గడ్డపై రాహుల్ గాంధీ అస్త్రాన్ని ప్రయోగించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది .

ఎన్నికలకు ముందే రాష్ట్రంలో ఎన్నికల వేడి
బిజెపి కంటే కాంగ్రెస్ పార్టీనే ది బెస్ట్ అనిపించుకునే విధంగా రేవంత్ రెడ్డి ఈ సారి సభను ప్లాన్ చేస్తున్నట్లు గా సమాచారం. ఇక రాహుల్ గాంధీని తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడంతో కాంగ్రెస్ పార్టీ ఫోకస్ కూడా తెలంగాణ పైనే ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఏది ఏమైనా ఎన్నికలు రాకముందే తెలంగాణ రాష్ట్రంలో జాతీయ నేతల పర్యటన లతో ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. ఒకపక్క చేరికలపై దృష్టి పెట్టి, మరోపక్క వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ కూడా దూకుడు చూపిస్తుంది.












Click it and Unblock the Notifications