నో రెస్ట్: కాంగ్రెసు అధిష్టానం హామీలు, రేవంత్ రెడ్డి ప్లాన్ ఇదీ...
తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెసులో చేరడం దాదాపుగా ఖాయమైంది. ఆయన శుక్రవారంనాడు వ్యూహాత్మకంగానే తెలుగుదేశం పార్టీ సమావేశానికి హాజరైనట్లు అర్థమవుతోంది. పొమ్మనలేక తనక
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెసులో చేరడం దాదాపుగా ఖాయమైంది. ఆయన శుక్రవారంనాడు వ్యూహాత్మకంగానే తెలుగుదేశం పార్టీ సమావేశానికి హాజరైనట్లు అర్థమవుతోంది. పొమ్మనలేక తనకు పొగ పెట్టారనే అభిప్రాయం కలిగించడానికి ఆయన ఈ సమావేశానికి హాజరైనట్లు కనిపిస్తున్నారు.
అంతేకాకుండా, తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి దగ్గరవుతోందనే సంకేతాలను కూడా పంపడానికి వీలవుతుందని ఆయన భావించి ఉంటారు. ఎలాగూ కాంగ్రెసులోకి వెళ్తున్నారు కాబట్టి టిడిపిలో చిచ్చు పెట్టడమే భావ్యమని కూడా అనుకుని ఉంటారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస చీఫ్ కె. చంద్రశేఖర రావుతో తాడో పేడో తేల్చుకోవడానికి రేవంత్ రెడ్డి సిద్దపడినట్లు తెలుస్తోంది. ఆ అవకాశం కాంగ్రెసు ద్వారా మాత్రమే ప్రస్తుత స్థితిలో సాధ్యపడుతుందని ఆయన భావించి ఉంటారు. అదే సమయంలో ప్రజలను వాగ్ధాటితో, పదునైన వ్యాఖ్యలతో ఆకట్టుకునే నాయకుడు ప్రస్తుతం కాంగ్రెసులో లేడు. ఆ కొరత రేవంత్ రెడ్డి ద్వారా మాత్రమే తీరుతుందని కాంగ్రెసు అధిష్టానం భావించి ఉంటుంది.

ఏ డిమాండ్లు పెట్టారు?
కాంగ్రెసులోకి రావడానికి రేవంత్ రెడ్డి పెట్టిన షరతులు, డిమాండ్లు ఏమైనా ఉన్నాయా, వాటికి అధిష్ఠానం ఎలా స్పందించిందనే అంశాలపై కాంగ్రెసు సీనియర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే, తెలంగాణ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ కుంతియా మాటలను బట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెసులో చేరడం ఖాయమనిపిస్తోంది. అయితే రేవంత్ రెడ్డి డిమాండ్లేవీ పెట్టలేదని అంటున్నారు.

ఇవీ డిమాండ్లు....
తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి కాంగ్రెసు అధిష్టానం అంగీకరించినట్లుగా ప్రచారం సాగుతోంది. రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన దాదాపు 25 మందికి శాసనసభ స్థానాల్లో టికెట్లు ఇవ్వడానికి కూడా అంగీకారం కుదిరిందని అంటున్నారు. దానికితోడు, జిల్లాల ఇంచార్జీల బాధ్యతలను కూడా కొంత మందిని రేవంత్ రెడ్డి వర్గానికి చెందినవారిని నియమిస్తారని అంటున్నారు. రేవంత్ రెడ్డికి ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని అంటున్నారు.

చంద్రబాబుపై వ్యూహాత్మకంగా....
రేవంత్ రెడ్డి చంద్రబాబుపై వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు. ఏదైనా తాను చంద్రబాబుతోనే మాట్లాడుతానని ఆయన అంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన వ్యవహారాలపై, తాను రాహుల్ గాంధీని కలిసిన విషయంపై ఆయనకే తాను జవాబుదారీని అని ఆయన చెబుతున్నారు. చంద్రబాబుతో తనకు ఎలాంటి విబేధాలు లేవనీ, తన అభ్యంతరమంతా కేసీఆర్ విషయంలోనేననే సంకేతాలు పంపడానికి ఆయన సిద్ధపడ్డారు.

రాహుల్ గాంధీ సమక్షంలో..
నవంబరు మొదటి లేదా రెండో వారంలో రేవంత్ రెడ్డి కాంగ్రెసులో చేరే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాల ద్వారా తెలుస్తోంది. నవంబరులో రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తారని, దానికి ముందుగానే ఢిల్లీలోనే రేవంత్ కాంగ్రెస్లో చేరతారని చెబుతున్నారు. ఆయనతోపాటు ప్రస్తుతానికి 2--25 మంది నాయకులు చేరతారని ప్రచారం సాగుతోంది. రేవంత్ దాదాపు 40 మంది నాయకుల జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానానికి అందించారని కూడా చెబుతున్నారు. మరో నాలుగైదు రోజుల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

పాదయాత్ర ద్వారా ఊపు....
తాను కాంగ్రెసులో చేరిన తర్వాత రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నట్లు చెబుతున్నారు. పాదయాత్ర ద్వారా కాంగ్రెసు పార్టీకి ఒక ఊపు తేవడమే కాకుండా తాను తిరుగులేని నాయకుడిగా ఎదగాలనే తలంపుతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. కెసిఆర్ను ఎదుర్కోవడమే ఏకైక లక్ష్యంగా ఆయన పాదయాత్ర కొనసాగుతుందని అంటున్నారు. కెసిఆర్ను ఎదుర్కోగల నాయకుడు తాను ఒక్కడినే అనిపించుకోవడం ద్వారా కెసిఆర్ వ్యతిరేక శ్రేణులను తన చుట్టూ ర్యాలీ చేసుకోవడానికి ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు.

కాంగ్రెసు నేతలతో సయోధ్య...
ఇప్పటికే రేవంత్ రెడ్డిని కొంత మంది కాంగ్రెసు నేతలు స్వాగతిస్తున్నారు. చిన్నారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, వి హనుమంతరావు వంటి నేతలు ఆయన రాకను ఆహ్వానిస్తున్నారు. మరింత మంది మద్దతును కూడగట్టుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన ఇప్పటికే మాజీ మంత్రి డికె అరుణను కలిశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ను కూడా ఆయన కలుసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కెసిఆర్ ఓడించడమే తన లక్ష్యమని చెబుతూ అందుకు సహకరించాల్సిందిగా ఆయన కోరుతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications