ఈ నైట్ పార్టీలేంటి? డ్రగ్స్కి బానిస చేస్తారా?, రూ.3వేలకే..: కేసీఆర్, కేటీఆర్లపై రేవంత్ ఫైర్
హైదరాబాద్: తెలంగాణ యువత, ప్రజలను డ్రగ్స్, మద్యానికి బానిసలు చేస్తారా? అంటూ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై కాంగ్రెస్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తోన్న సెన్సేషన్ రైజ్ డ్యాన్స్ కార్యక్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Recommended Video
అమ్మాయిలతో అసాంఘిక కార్యకలాపాలు
ఈ కార్యక్రమంలో మాదకద్రవ్యాల(డ్రగ్స్) సరఫరా, మద్యం, అమ్మాయిలతో యథేచ్ఛగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని రేవంత్ ఆరోపించారు. భారీగా డబ్బులు వసూలు చేసి ఆ కార్యక్రమానికి మైనర్లను కూడా అనుమతిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
రూ. 3వేలకే అరాచకాలు
ఈవెంట్స్ నౌ సంస్థ డేటింగ్ ఏర్పాటు చేస్తోందని.. అమ్మాయిలు, అబ్బాయిలను రూ. 3 వేలకే అప్పచెబుతామంటూ అరాచకాలు చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిన ఈవెంట్స్ నౌ సంస్థ ఈ దారుణమైన కార్యక్రమాన్ని చేపట్టిందని రేవంత్ చెప్పారు.
బానిసలుగా మారుస్తారా?
తెలంగాణ సర్కారు యువతను గంజాయి, డ్రగ్స్కు బానిసలుగా మారుస్తోందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమం నిర్వహణపై ఎన్నికల అధికారి రజత్కుమార్ జోక్యం చేసుకుని నిలువరించకుంటే తామే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని రేవంత్ హెచ్చరించారు.
క్రీడా మైదానంలో మద్యం పారిస్తారా?
ఇంత జరుగుతున్నా టాస్క్ ఫోర్స్, సిట్ నిద్రపోతున్నాయా? అని ప్రశ్నించారు. బెంగళూరు, పుణెల్లో సెన్సేషన్ రైజ్ ఈవెంట్స్ను నిషేధిస్తే గచ్చిబౌలి స్టేడియంలో ఆ సంస్థ ఈవెంట్ నిర్వహణకు ఎలా అనుమతిచ్చారని నిలదీశారు. క్రీడల మైదానంలో మద్యాన్ని పారిస్తారా? అంటూ రేవంత్ మండిపడ్డారు. గతేడాది హైదరాబాద్ నగరంలో కలకలం సృష్టించిన బార్లు, పబ్లలో మాదక ద్రవ్యాల అమ్మకాలపై హడావుడి చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడెందుకు మౌనంగా ఉందని రేవంత్ ప్రశ్నించారు.