24గంటల గడువిస్తున్నా, లేదంటే..: ఆ మీడియా సంస్థలకు రేవంత్ వార్నింగ్
Recommended Video

హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతేగాక, పలు మీడియా సంస్థలకు హెచ్చరికలు జారీ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

నాపై తప్పుడు కథనాలు
టీవీ9, టీన్యూస్, నమస్తే తెలంగాణ అనే మీడియా సంస్థలు తనపై తప్పుడు కథనాలు ప్రచురితం చేశాయని, కోట్ల రూపాయలు తన ఖాతాల్లోకి వచ్చాయని పేర్కొన్నాయని రేవంత్ తెలిపారు. ఆ కథనాల ఆధారంగానే తనపై ఐటీ దాడులు జరిగాయని అన్నారు.

ఐటీ అధికారులు వేధించారు.. ఐదు పైసల వ్యవహారం లేదు
ఈ మీడియాల్లో వచ్చిన కథనాల ఆధారంగానే తన ఇళ్ల, బంధువుల నివాసాలపై మూడు రోజులపాటు ఐటీ అధికారులు దాడులు చేసి, తనను వేధించారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సింగపూర్, మలేషియా దేశాల్లో తనకు బ్యాంక్ ఖాతాలున్నట్లు సదరు మీడియా సంస్థలు పేర్కొన్నాయని, తనకు ఏ దేశంలోనూ బ్యాంక్ ఖాతాలు లేవని, ఐదు పైసల లావాదేవీలు కూడా లేవని అన్నారు.

నా ప్రతిష్టకు భంగం కలిగించేందుకే
ఎన్నికల ముందు తన ప్రతిష్టకు భంగం కలిగించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేలా ఆ మీడియా సంస్థలు వ్యవహరిస్తున్నాయని రేవంత్ ఆరోపించారు. అంతేగాక, టీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూర్చేలా చూస్తున్నాయని అన్నారు. తనపై టీవీ9, టీన్యూస్, నమస్తే తెలంగాణ తప్పుడు కథనాలు ప్రచురితం చేశాయని అన్నారు.

24గంటల గడువిస్తున్నా..
ఆ మీడియా సంస్థలు తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేసినందుకు క్షమాపణ చెప్పాలని, అంతేగాక, తనపై ప్రచురితం చేసినవి తప్పుడు కథనాలని తిరిగి పేర్కొనాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ సంస్థలకు తాను 24గంటలపాటు గడివిస్తున్నట్లు చెప్పారు. టీవీ9 యజమాని రామేశ్వరరావు, టీన్యూస్ కేసీఆర్ కుటుంబం, నమస్తే తెలంగాణ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే కోర్టులో దావా వేస్తానని రేవంత్ హెచ్చరించారు.

రేవంత్ వార్నింగ్
మిగితా పాత్రికేయ మిత్రులు కూడా సంయమనం పాటించాలని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా కోరారు. వార్తలను పరిశీలించిన తర్వాతే ప్రచురితం చేయాలని అన్నారు. తప్పుడు వార్తలను రాసి ప్రతిష్టకు భంగం కలిగిస్తే కేసులు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications