యశ్వంత్ సిన్హా కేసీఆర్ కలిస్తే జరిగేదిదేనా? ఆ ఇంటిమీద కాకి ఈ ఇంటిమీద వాలేదిలేదట!!
తెలంగాణ రాష్ట్రంలో విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాక కాంగ్రెస్ పార్టీలో కొత్త పంచాయితీకి తెరతీసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన యశ్వంత్ సిన్హా జూలై 2వ తేదీన హైదరాబాద్ నగరానికి రానున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ యశ్వంత్ సిన్హా రాకను స్వాగతిస్తూ భారీ ర్యాలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. యశ్వంత్ సిన్హాకు తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతు ప్రకటించిన నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ ను కలిస్తే యశ్వంత్ సిన్హాను తాము కలిసేది లేదు: రేవంత్ రెడ్డి
యశ్వంత్ సిన్హా విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. యశ్వంత్ సిన్హా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయితే కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఆయనను కలవబోరని టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి తేల్చి చెబుతున్నారు. ముందు కేసీఆర్ ను కలిసినా, లేదా తమను కలిసిన తర్వాత టిఆర్ఎస్ వాళ్ళని కలవాలని చూసినా ఒప్పుకునేది లేదని తెలంగాణ పిసిసి తేల్చి చెబుతోంది.
ఇద్దరూ ముఖ్యమే... యశ్వంత్ సిన్హాకు ఇబ్బందికర పరిణామం
యశ్వంత్ సిన్హా కు టిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన నేపథ్యంలో హైదరాబాదుకు వచ్చి టిఆర్ఎస్ అధినేతను కలవకుండా యశ్వంత్ సిన్హా వెళ్లలేరు. ఆయనకు టీఆర్ఎస్ ఓట్లు కావాలి. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బాస్ ఆయనను కలిస్తే ఒప్పుకోబోమని చెప్తున్నారు. కాంగ్రెస్ నేతలను కలవకుండా వెళ్తే ఇది కూడా యశ్వంత్ సిన్హాకు ఇబ్బందికర పరిణామమే . అయితే తెలంగాణా కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ను , తమను యశ్వంత్ సిన్హా కలిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెబుతున్నారు.
ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలేది లేదన్న రేవంత్ రెడ్డి
ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలేది లేదని తాము ముందే చెప్పామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. యశ్వంత్ సిన్హా కాంగ్రెస్ అభ్యర్థి కాదని, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ మద్దతు అడిగితే తాము ఇచ్చామని రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు హైదరాబాద్ రాక పెద్ద తలనొప్పిగా తయారైంది. ఒకపక్క బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సమయంలో హైదరాబాద్ కు రావటం ఒక టాస్క్ అయితే ఇక్కడ కాంగ్రెస్, టీఆర్ఎస్ లను కలవటం ఆయనకు కత్తిమీద సామే.
కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య నలిగిపోతున్న రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా
కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్న చందంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పరిస్థితి ఉంది. ఒక పక్క టిఆర్ఎస్ భారీ ర్యాలీ నిర్వహించి యశ్వంత్ సిన్హా ను స్వాగతించాలని ప్రయత్నిస్తుంటే, మరోపక్క అల్టిమేటం జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ తీరు, యశ్వంత్ సిన్హా రాకపై ఆసక్తికి కారణంగా మారింది.