కూతురి నిశ్చితార్థం: ఒత్తిడిలో రేవంత్ భార్య, ఊరటనిస్తుందా?
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టై చర్లపల్లి జైలులో ఉన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సతీమణి గీత మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలిసింది. రేవంత్ అరెస్టు సమయంలో కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని చెప్పిన ఆమె, కుమార్తె నిశ్చితార్థ కార్యక్రమ సమయానికి కాస్తంత ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది.
గురువారం రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్ధ కార్యక్రమం ఉన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని బంధువులు దగ్గరుండి చూస్తున్నా, కుమార్తె విషయంలో ముఖ్యమైన కార్యక్రమం కావడంతో భర్త రేవంత్ దగ్గర లేకుండా అన్నీ ఆమె చూసుకోవాల్సి రావడం ఆమెను బాధిస్తోందని అంటున్నారు.
మంగళవారం రేవంత్కు బెయిల్ వస్తుందని ఆశ పెట్టుకున్న ఆ పిటిషన్ బుధవారానికి వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. బుధవారం రేవంత్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి తరుపు న్యాయవాదులు కోరారు. రేవంత్కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని ఏసీబీ తరుపు న్యాయవాదులు తెలిపినట్లు తెలుస్తోంది.
మధ్యంతర బెయిల్ నేపథ్యంలో ఎవరితోనూ కలవడకుండా చూడాలని ఏసీబీ తరుపు న్యాయవాదులు కోరినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు మధ్యంతర బెయిల్ మంజూరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గురువారం జరిగే రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ఆయన..గురువారం ఉదయం ఫంక్షన్ కోసమే ఢిల్లీ నుంచి రానున్నారు. ఆ రోజు ఆయన కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలవాల్సి ఉంది. ఏపీలో అందుబాటులో ఉన్న మంత్రులందరూ రేవంత్ కుమార్తె నిశ్చితార్థానికి హాజరుకానున్నారు.