ఇలాగే ఉంటే తొలి స్థానం: కెసిఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు సోమవారం బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని, 14 నెలల్లో 1150 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆ లేఖలో అన్నారు.
రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రెండవ స్థానంలో ఉందని ఆయన తెలిపారు. పరిస్థితి ఇలాగే ఉంటే మొదటి స్థానానికి వచ్చినా ఆశ్చర్యం లేదని రేవంత్ లేఖలో అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం అందించాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. కరవు నివారణకు అవసరమైన కార్యాచరణ లేదని, వెంటనే కరవు మండలాలను ప్రకటించాలని రేవంత్ రెడ్డి అన్నారు.

నిరుడు కూడా కరవుపై కేంద్రానికి నివేదిక పంపలేదని ఆయన తెలిపారు. విత్తనం వేసి నష్టపోయిన రైతులకు ఇన్ఫుట్ సబ్సీడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరవు నిర్మూలనకు సమగ్ర కార్యాచరణ ప్రకటించాలని రేవంత్రెడ్డి లేఖలో విజ్ఢప్తి చేశారు.
నోటుకు ఓటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టయి, బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా వరుసగా ఆయన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై మాటల యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఆ బహిరంగ లేఖ రాశారు.












Click it and Unblock the Notifications