ఇంకో 4 రోజుల్లో పోలింగ్: అవమానాలు అవసరమా- ఆలోచించుకోండి: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార జోరు పెరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి. ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది.
ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో- తెలంగాణలోని అన్ని స్థానిక సంస్థలకు చెందిన ప్రజా ప్రతినిధులకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత రేవంత్ రెడ్డి బహిరంగ లేఖను రాశారు. నాలుగు పేజీల లేఖ ఇది. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో ఈ పదేళ్ల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలను ఇందులో ప్రస్తావించారు.

వార్డు సభ్యుడి నుంచి కార్పొరేషన్ల మేయర్ల వరకు అందరికీ ఈ లేఖ వర్తిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ పెద్దలు వారిని కట్టు బానిసల కంటే హీనంగా చూశారని ఆరోపించారు.
స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వక అప్పులు పాలు చేసి వ్యక్తిగత జీవితాలను చిన్నాభిన్నం చేశారని ధ్వజమెత్తారు. నిధులను ఇవ్వక హేళన చేసిందని మండిపడ్డారు. గ్రామాల అభివృద్ధికి తెచ్చిన అప్పులను సకాలంలో చెల్లించలేక అనేక మంది స్థానిక ప్రజా ప్రతినిధులు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత విషాదకరమని, దీనికి బీఆర్ఎస్ ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు.

కేసీఆర్ పాలనను అంతం చేయడానికి, స్థానిక ప్రజా ప్రతినిధులకు పూర్వ వైభవాన్ని తీసుకుని వచ్చే సమయం ఆసన్నమైందని రేవంత్ రెడ్డి అన్నారు. జెండాలు, అజెండాలు పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా నవంబర్ 30వ తేదీన జరిగే పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు.
గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల స్థాయిని పెంచేలా, వాటికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ప్రజా ప్రతినిధుల గౌరవాన్ని పెంచేలా తాము చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. స్థానిక పరిపాలనాభివృద్ధికి సరికొత్తగా నాంది పలుకుతామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications