రామాయంపేటలో కేటీఆర్ మామకు నిరసన సెగ!
రామాయంపేట : మొత్తానికి తెలంగాణలో కొత్త జిల్లాల సంగతి ఓ కొలిక్కి రాగా.. ఇప్పుడు కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్ల విషయంలో కొత్త పంచాయితీలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే నల్గొండ జిల్లాలోని గట్టుప్పల్ ను మండల కేంద్రంగా ప్రకటించాలంటూ ఆందోళనలు కొనసాగుతుండడం.. 144 సెక్షన్లు విధించడం వంటి ఘటనలు జరుగుతుండగా.. సీఎం సొంత ఇలాకా అయిన మెదక్ లోను నిరసన గళాలు వినిపిస్తున్నాయి.
అసలు విషయానికొస్తే.. మెదక్ జిల్లాలోని రామాయంపేటను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలంటూ గతకొద్ది రోజులుగా అక్కడ ఆందోళనలు జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. మంగళవారం నాడు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కు స్వయాన మామ అయిన హరినాథరావుకు ఆ సెగ తగిలింది. ఆయన తన స్వగ్రామం అయిన దామరచెర్వుకు వస్తున్నారన్న సమాచారంతో రెవెన్యూ డివిజన్ కోసం ఆందోళన చేస్తోన్నఅఖిలపక్ష నాయకులంతా ఆయన కారుకు అడ్డు తగిలారు.
అంతగా ఉద్రిక్తతలు ఏం చోటు చేసుకోనప్పటికీ.. అఖిలపక్ష నాయకులంతా హరినాథరావుకు కారుకు అడ్డుపడడం.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడంతో కాస్త టెన్షన్ వాతావరణాన్ని తలపించింది. అనంతరం కారు దిగిన హరినాథరావు దీక్షాస్థలి వద్దకు వెళ్లి.. ఆందోళన చేస్తోన్న అఖిలపక్ష నాయకులకు సంఘీభావం ప్రకటించారు. 1955ల్లోనే రామాయంపేట ఓ వెలుగు వెలిగిన ప్రాంతమని, అయితే కొంతమంది నేతల అభ్యంతరం మేరకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు జరిగి ఉండకపోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే ఇప్పటికీ రెవెన్యూ డివిజిన్ల ఏర్పాటు విషయంలో చర్చలు జరుగుతున్నందువల్ల.. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో డివిజన్ ఏర్పాటుకై ప్రయత్నం చేస్తామని హామి ఇచ్చారు. రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేయాలన్న ప్రతిపాదనకు సంబంధించిన ఫైల్ కేసీఆర్ వద్ద పరిశీలనలో ఉన్నట్లు తెలియజేశారు. ఇకపోతే కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా సీఎం కేసీఆర్ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని.. వియ్యంకుడిని ప్రశంసించారు హరినాథరావు. ఒకవేళ రామాయంపేటకు రెవెన్యూ డివిజన్ సాధ్యం కాకపోతే అందుకు ధీటుగా పట్టణాన్ని అబివృద్ది చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేస్తామన్నారు.