రోడ్డుకు అడ్డంగా మంచం వేసుకుని, పురుగుమందు డబ్బాతో రైతు నిరసన .. రీజన్ ఇదే
రెవెన్యూ వ్యవస్థలో సమూల ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం నూతన చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రెవెన్యూ శాఖలో పేరుకుపోయిన అవినీతిని నిర్మూలించడం కోసం ప్రభుత్వం ఒక వైపు ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంటే, మరోవైపు రెవెన్యూ శాఖ అధికారుల తీరు ప్రజలకు తలనొప్పిగా తయారైంది.

దారికి అడ్డంగా మంచం వేసుకుని రైతు ఆందోళన
సీఎం కేసీఆర్ రెవెన్యూ ప్రక్షాళనపై దృష్టి సారించి కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అధికారుల తీరు మారకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఒక రైతు దారికి అడ్డంగా మంచం వేసుకుని కూర్చుని పురుగుల మందు బాటిల్ చేత్తో పట్టుకొని ఆత్మహత్య చేసుకుంటానని నిరసనకు దిగాడు. రెవెన్యూ అధికారుల తీరుతో విసిగిపోయిన రఘుపతి అనే రైతు ఊరికి వచ్చే దారికి అడ్డంగా మంచం వేసుకుని పడుకున్నాడు. రెవెన్యూ అధికారులపై తన నిరసన వ్యక్తం చేస్తున్నాడు.

పట్టాదారు పాస్ బుక్ కోసం లంచం డిమాండ్ .. రెవెన్యూ అధికారులపై రైతు ఆగ్రహం
చిట్యాల మండలం నైన్ పాక గ్రామానికి చెందిన రైతు రఘుపతికి ఐదెకరాల పొలం ఉండగా, తన భూమికి పట్టాదార్ పాస్ పుస్తకం కోసం ఐదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.అయితే ఏ అధికారి తన సమస్యను పట్టించుకోకపోవడంతోపాటు లంచం ఇస్తేనే పని చేస్తామని చెప్పడంతో ఆవేదన చెందిన రైతు వినూత్నంగా నిరసన చేపట్టాడు. గ్రామానికి వచ్చే రోడ్డుకు అడ్డంగా రాళ్లను వేసి, అక్కడ మంచం వేసుకుని పురుగుల మందు డబ్బా పక్కన పెట్టుకొని తన నిరసనను తెలియ చేస్తున్నాడు.
Recommended Video

అధికారులు సమస్య పరిష్కరించకుంటే చనిపోతానని హెచ్చరిక
ఇప్పటికైనా అధికారులు తమ సమస్యలు పరిష్కరించకుంటే చనిపోతానని హెచ్చరిస్తున్నాడు. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయడం కోసం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకు వచ్చినప్పటికీ అధికారులు లంచం డిమాండ్ చేస్తున్నారని ఓ రైతు ఈ తరహా నిరసనకు దిగడం రెవెన్యూ శాఖలో మారని అవినీతి అధికారుల తీరుకు నిదర్శనం.
రెవెన్యూ వ్యవస్థలో వేళ్ళూనుకున్న లంచం మహమ్మారి సీఎం కేసీఆర్ రెవెన్యూను ఎంత ప్రక్షాళన చేసినా మారుతుందన్న నమ్మకం ప్రజలకు కలగటం లేదు .












Click it and Unblock the Notifications