కాంగ్రెస్ పార్టీలో ఎంపీ సీట్ల కోసం పెరుగుతున్న పోటీ..!మోకాళ్ల మీద కొండలెక్కుతున్న నేతలు..!!
హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలహీనపడిపోయిందని అందరూ నిర్ధారించుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలోపేతం కావడానికి చాలా సమయం పడుతుందని అంచనా వేసుకుంటున్నారు కొందరు విశ్లేషకులు. కాని వీరందరి అభిప్రాయాలను పటాపంచలు చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. శాసన సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పటికి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చూపిస్తామంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇందులో భాగంగా ఎంపీ సీట్లు కూడా పెద్ద యెత్తున ఆశిస్తున్నారు నాయకులు. కాంగ్రెస్ అదిష్టానం ఎంపీ సీటు కేటాయిస్తే గెలిచి చూపిస్తామని కొందరు నేతలు అంటుంటే, సీటు తమకే కేటాయించాలని కొంత మంది నేతలు మోకాళ్ల ప్రదక్షిణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్తిత్వం కోసం ఇంత పోటీ నెలకొందా అని ఆశ్యర్యపోతున్నారు సొంత పార్టీ నేతలతో పాటు కొంత మంది ఇతర పార్టీ నేతలు.
కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ను స్థానిక నాయకుడు ఊట్ల వరప్రసాద్ కే కేటాయించాలని కోరుతూ దేవుని పల్లి నరసింహ స్వామి గుడిలోని దాదాపు 416 మెట్లను మోకాళ్ళపైన ఎక్కారు కాంగ్రెస్ సేవాదళ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్, మరియు యువజన కాంగ్రెస్ నాయకుల ఆద్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
స్థానిక నాయకుడు, యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ,సింగరేణి కార్మికుని వారసుడు ఊట్ల వరప్రసాద్ కే పెద్దపల్లి టికెట్ ఇవ్వాలని నరసింహ స్వామి వారికి మొక్కుకున్నట్టు ప్రసన్న కుమార్ తెలిపారు. స్థానిక నాయకునికి ఎంపీ టికెట్ కేటాయిస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని , ఇప్పటివరకు పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి స్థానికేతరులకే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగిందని అన్నారు. స్థానిక నాయకుడు, ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పోరాడేవాడు , ఊట్ల వరప్రసాద్ గారికి టికెట్ ఇచ్చినట్లయితే గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేసారు ప్రసన్న కుమార్. స్థానిక నేతలు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం శ్రమిస్తున్న విధానానికి అవాక్కవుతున్నారు టీపిసిసి సీనియర్ నేతలు.