కొత్త టార్గెట్ ఫిక్స్.. : 'సెంట్రల్ పాలిటిక్స్ పై కేసీఆర్ గురి..'
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. సీఎం కేసీఆర్ తమ రెండేళ్ల పాలనను సంక్షిప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ఆయా ప్రధాన పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్న ఆయన దేశ భవిష్యత్ రాజకీయాల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్వ్యూలో భాగంగా.. 2019లో దేశంలో ప్రాంతీయ పార్టీలదే 100 శాతం హవా ఉంటుందని పక్కాగా చెప్తున్న కేసీఆర్, అందులో టీఆర్ఎస్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కేంద్రంలో చక్రం తిప్పడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ వ్యూహాం రచిస్తున్నారా.. అన్న ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి..
సీఎం కేసీఆర్ చెబుతున్న లెక్కలను ఒకసారి పరిశీలిస్తే.. వచ్చే ఎన్నికల్లో కేవలం 200 నుంచి 230 స్థానాల్లో మాత్రమే జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ మధ్య ముఖాముఖి పోరు ఉంటుందని, మిగతా 350 స్థానాల్లో ప్రాంతీయ పార్టీలే ఆధిపత్యం కనబర్చడం ఖాయమని తేల్చి చెప్తున్నారు. ప్రాంతీయ పార్టీల హవా గురించి ఉదాహరిస్తూ.. తమిళనాడులో జయలలిత గెలిచి ఉండకపోతే, కరుణానిధి చేతికి పగ్గాలు వెళ్లుండేవి అంతే తప్ప కాంగ్రెస్, బీజేపీలకు అక్కడ స్థానం లేదన్నారు.
తనకు గుర్తున్నంత వరుకు దేశంలో కేవలం నాలుగైదు రాష్ట్రాల్లోనే జాతీయ పార్టీల పాలన కొనసాగుతోందని చెప్పిన ఆయన, 20కి పైగా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు 2019 ఎన్నికల్లో చక్రం తిప్పడం ఖాయమన్నారు. బీజేపీ లాంటి జాతీయ పార్టీ మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రంలో అధికారంలో ఉన్నా.. అది కేవలం ప్రాంతీయ పార్టీ అయిన శివసేన మద్దతుతోనే సాధ్యపడిందని, శివసేన లేకపోతే బీజేపీకి అక్కడ అధికారం లేదని అన్నారు.
ఇప్పటికే తనతో నలుగురు జాతీయ నాయకులు టచ్ లో ఉన్నారని సీఎం కేసీఆర్ చెప్పడం బట్టి చూస్తోంటే, సెంట్రల్ పాలిటిక్స్ పై ఆయన ఫోకస్ చేశారన్న వాదనలకు మరింత బలం చేకూరుతోంది. ప్రస్తుతానికి తనతో సంప్రదించిన నేతలకు భిన్నాభిప్రాయాలు ఉన్నా.. ఎన్నికల ప్రక్రియ దగ్గరపడే నాటికి 70 నుంచి 80 స్థానాలను గెలిస్తే ప్రెషర్ గ్రూప్ గా ఉంటాం కదా అన్న అభిప్రాయం తమలో వ్యక్తమైనట్టుగా చెప్పుకొచ్చారు.
ఎన్నికలకు ఏడాది ముందు నుంచి దీనిపై మరింతగా ఫోకస్ పెడతామని కేసీఆర్ చెప్పారు. అంటే, వచ్చే ఎన్నికల నాటికి ప్రాంతీయ పార్టీలను కూడగట్టడంలో కేసీఆర్ ముందుండి వ్యవహారాలను చక్కదిద్దే పరిస్థితులు లేకపోలేదు. ఉత్తరప్రదేశ్ ఎన్నిలు జరిగిన తర్వాత దేశ సమకాలీన రాజకీయ పరిస్థితుల గురించి విశ్లేషించుకుని ఈ విషయంలో ముందడుగు వేస్తామని పేర్కొన్న ఆయన, కూటమి ఏర్పాటు 100 శాతం జరిగి తీరుతుందని కుండబద్దలు కొట్టినట్టుగా తెలిపారు.
ఢిల్లీ పాదాల దగ్గర సాగిలపడి బతిమాలుకునే దశ నుంచి దేశ రాజకీయాలను శాసించే దిశగా ప్రాంతీయ పార్టీల ప్రయాణం ఉండబోతుందని తెలియజేశారు. ఇందులో టీఆర్ఎస్ పాత్ర చాలా కీలకంగా మారనుందన్న కేసీఆర్ వ్యాఖ్యలను గమనిస్తే.. దీనిపై ఇప్పటినుంచే ఆయా ప్రాంతీయ పార్టీల గెలుపోటముల లెక్కలతో సహా కూటమి ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియపై ఆయన ఫోకస్ చేశారేమో అన్న చర్చ జరుగుతోంది.
కొసమెరుపు :
ఇక ఏపీ రాజకీయాల గురించి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తెలంగాణలో రాజకీయాలన్ని టీఆర్ఎస్ వైపు ఏకపక్షంగా ఉంటే ఏపీలో మాత్రం అలాంటి పరిస్థితి లేదన్నారు. అంటే వచ్చే ఎన్నికల నాటికి ప్రజాభిప్రాయంలో మార్పులు రావొచ్చన్న విషయాన్ని కేసీఆర్ పరోక్షంగా ప్రస్తావించారంటున్నారు పలువురు.