దాడులు రెట్టింపయ్యే ప్రమాదం.!ఐనా భయం వద్దు.!ప్రభుత్వ ఏర్పాటు వరకు తగ్గొద్దన్నబండి సంజయ్.!
హైదరాబాద్ : తెలంగాణలో సీఎం చంద్రశేఖర్ రావు పాలనపట్ల జనం విసిగిపోయారని, టీఆర్ఎస్ ను ధీటుగా ఎదిరించే పార్టీ బీజేపీ మాత్రమేనని జనం భావిస్తున్నారని, ఇటీవల వెల్లడైన అన్ని సర్వే సంస్థల నివేదికలు ఇదే చెబుతున్నయని బీజేపి తెలంగాణ అద్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్పష్టం చేసారు. ఈ విషయం పసిగట్టిన సీఎం చంద్రశేఖర్ రావు భయపడుతున్నరని అన్నారు. బీజేపి నేతలపై దాడులు చేయిస్తున్నడని, అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నడని మండి పడ్డారు. రాబోయే రోజుల్లో అధికార పార్టీ నుండి దాడులు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని, అయినా భయపడే ప్రసక్త లేదని, జనం పక్షాన ఉంటూ ధైర్యంగా ఎదుర్కొందామని పార్టీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపునిచ్చారు.
Recommended Video
బీజేపీ పక్షాన తెలంగాణ జనం.. భయంతోనే కేసీఆర్ కుట్రలన్న బండి సంజయ్
అంతే కాకుండా రాబోయే రెండేళ్లు జనంలోనే ఉందామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదాకా కష్టపడి పనిచేద్దామన్నారు సంజయ్. అంతిమంగా బీజేపీ సారథ్యంలో పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. అందులో భాగంగా వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో యువ మోర్చా ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్ నిర్వహించాలని ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్రస్థాయిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, యువ, కిసాన్, మహిళా, మైనారిటీ మోర్చాల అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులతో బండి సంజయ్ వర్చువల్ మీటింగ్ నిర్వహించారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మిలియన్ మార్చ్. కార్యాచరణ రూపొందించిన బీజేపి
ఆయా మోర్చాల జిల్లా, మండల కమిటీల ఏర్పాటు, జిల్లా, కార్యవర్గ సమావేశాల తీరుతెన్నులు, కేంద్ర పథకాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లడానికి మోర్చాలు చేపట్టిన చర్యలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చేపడుతున్న కార్యక్రమాలు, ఆయా మోర్చాలు చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై దాదాపు రెండున్నర గంటలపాటు సుధీర్ఘంగా సమీక్షించారు. ఈ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ శక్తివంతంగా తయారైందని, తెలంగాణలో టీఆర్ఎస్ పాలనపట్ల ప్రజలు విసిగిపోయారని, సీఎం చంద్రశేఖర్ రావు నియంత-కుటుంబ-అవినీతి పాలనపై బీజేపీ చేస్తున్న పోరాటాలు జనంలోకి వెళుతున్నాయన్నారు బండి సంజయ్.
రాష్ట్ర మోర్చాలు, పదాధికారుల సమావేశం..దిశానిర్దేశం చేసిన బండి సంజయ్
టీఆర్ఎస్ ను ధీటుగా ఎదిరించే పార్టీ బీజేపీ మాత్రమేనని జనం అర్ధం చేసుకున్నారని, ఇప్పటికి అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చాం, ఈసారి బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇద్దామని జనం ఆలోచిస్తున్నరని, ఇటీవల వెల్లడైన ఏ సర్వే సంస్థ ఫలితాలే నిదర్శనమన్నారు బండి సంజయ్. దీనికి ప్రధాన కారణం బీజేపీ సమిష్టిగా చేస్తున్న ఉద్యమాలే కారణమన్నారు. ప్రభుత్వం లాఠీఛార్జీలు చేసినా, కేసులు పెట్టినా. జైలుకు పంపుతున్నా, భయపడకుండా జనం కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని బండి సంజయ్ పేర్కొన్నారు.
రాబోయే రెండేళ్లు జనంలోనే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదాకా కష్టపడాలన్న బండి సంజయ్
అంతే కాకుండా సీఎం చంద్రశేఖర్ రావుకు ఈ విషయం అర్ధమై భయపడుతున్నడని, బీజేపీని అడ్డుకునేందుకు అనేక కుట్రలు చేస్తున్నారని అన్నారు. అక్రమంగా కేసులు పెడుతున్నాడని, దాడులు చేయిస్తున్నడని అన్నారు. కరీంనగర్ లో, నల్గొండ జిల్లాలో తనపై, నిజామాబాద్ లో ఎంపీ అరవింద్ పై జరిగిన దాడులే ఇందుకు నిదర్శనమన్నారు బండి సంజయ్. రాబోయే రోజుల్లో ఈ దాడులు ఇంకా అధిగమయ్యే ప్రమాదం ఉంది. అయినా సరే వెనుకంజ వేసేది లేదని, సీఎం చంద్రశేఖర్ రావు కుట్రలను ధీటుగా ఎదుర్కొందామని, ప్రజల పక్షాన ఉంటూ ఐక్యంగా ఉంటూ పోరాటం కొనసాగిద్దామని బండి సంజయ్ పిలుపునిచ్చారు.