రాజీవ్ రహదారిపై ఘోర ప్రమాదం: క్వాలిస్, లారీ, బస్సు ఢీ, 10మంది మృతి
హైదరాబాద్: ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి మంచిర్యాల వెళ్తున్న రాజధాని ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొని బోల్తా కొట్టింది.
అయితే, అంతకుముందు ఓ క్వాలిస్ వాహనం లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో లారీని ఢీకొట్టింది. ఆ తర్వాత రాజధాని బస్సు లారీని ఢీకొట్టి బోల్తా పడింది. కాగా, మరో వాహనం వచ్చి క్వాలిస్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో క్వాలిస్ వాహనం నుజ్జునుజ్జు అయింది.
ఈ ప్రమాదంలో క్వాలిస్ వాహనంలోని ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆర్టీసీ బస్సులోని ప్రయాణికుల్లో ముగ్గురు మరణించగా, మరో 30మంది గాయాలపాలయ్యారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. క్షతగాత్రులను గజ్వేల్, హైదరాబాద్లోని ఆస్పత్రులకు తరలించి చికత్స అందిస్తున్నారు. సిద్దిపేటకు చెందిన పోలీసులు, అధికారులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో మృతి చెందిన వివరాలు తెలియాల్సి ఉంది.