అర్థరాత్రి దొంగల హల్ చల్ : బెడిసికొట్టిన బ్యాంకు దోపిడి ప్లాన్
మెయినాబాద్ (రంగారెడ్డి) : మొయినాబాద్ పరిధిలోని అజీజ్ నగర్ లో బ్యాంకు దోపిడీ యత్నం కలకలం రేపింది. అర్థరాత్రి దాటిన తర్వాత కొందరు దుండగులు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో చోరీకి యత్నించగా.. స్థానికుల అప్రమత్తతో దుండగులంతా పరారయ్యారు. అయితే స్థానికులు దుండగులను వెంబడిస్తున్న క్రమంలో.. దుండగులు గాల్లో రెండు రౌండ్లు కాల్పులు జరపడం గమనార్హం.
పూర్తి వివరాలను పరిశీలిస్తే.. రాత్రి ఒంటి గంట సమయంలో కొంతమంది దుండగులు తెలంగాణ గ్రామీణ బ్యాంకు వద్ద తచ్చాడుతూ.. తాళాలు పగలగొట్టడానికి యత్నించారు. విషయాన్ని గమనించిన ఇద్దరు యువకులు దుండగుల వద్దకు వెళ్లి ప్రశ్నించడంతో, అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు దుండగులు. ఇంతలో స్థానికులు కూడా పోగవడంతో దుండగులు పరుగులు పెట్టారు.
అయితే దుండగులను స్థానికులు కొద్ది దూరం వెంబడించడంతో.. ప్రతిఘటించిన దుండగులు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం పోలీసులు సమాచారమందించగా.. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ లతో సంఘటనా స్థలంలో తనిఖీలు నిర్వహించారు.
అనంతరం మాదాపూర్ డీజీపీ కార్తికేయ ఘటనా స్థలాన్ని పరిశీలించి ఘటన జరిగిన తీరుపై ఆరా తీశారు. విచారణ నిమిత్తం రెండు బృందాలను నియమించిన పోలీస్ యంత్రాంగం.. ఇది అంతరాష్ట్ర దొంగల పని అయి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.