SLBC Tunnel: ఆ ప్రాంతం ప్రమాదకరంగా ఉంది!
SLBC Tunnel: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(ఎస్ఎల్బీసీ) టన్నెల్లో గల్లంతైన 8 మంది సిబ్బంది కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్ 14 కిలోమీటర్లలో చివరి 50 మీటర్లలో సహాయక చర్యలు చేపట్టేందుకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆ ప్రాంతంలో తవ్వకాలు చేపడితే రెస్క్యూ బృందాలకు సైతం ప్రమాదం పొంచి ఉందని వెల్లడించారు.
రెస్క్యూ బృందాలకు ప్రమాదం పొంచి ఉన్నందున రోబోల సాయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ క్రమంలో రెండు మూడు రోజులుగా జరుగుతున్న సహాయక చర్యల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. టన్నెల్ వద్ద ఏర్పాటు చేసిన టీబీఎం నమూనాను మంత్రి ఉత్తమ్ పరిశీలించారు. కార్మికులను బయటకు తీసుకొచ్చే ప్రణాళికను కల్నల్ పరీక్షిత్ మెహ్రా మంత్రికి వివరించారు.

ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కనిపెట్టేందుకు కొనసాగుతున్న చర్యలపై సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోనే సొరంగాల్లో ఈ తరహా క్లిష్టమైన ప్రమాదం ఎక్కడా జరగలేదన్నారు.
ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా సొరంగాల నిర్మాణాలు, సహాయ చర్యల్లో పాల్గొన్న నిపుణుల సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు తీసుకుని ముందుకు వెళ్తున్నామని మంత్రి తెలిపారు. 14 కిలోమీటర్ల సొరంగ మార్గంలో 13.950 కిలోమీటర్ల వరకూ సహాయక బృందాలు వెళ్లగలుగుతున్నాయన్నారు.అయితే, చివరి 50 మీటర్లలో సహాయక చర్యలు చేపట్టడం అత్యంత ప్రమాదకరంగా మారిందని మంత్రి వివరించారు.
రెస్క్యూ టీంలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు సహాయక చర్యల్లో రేపటి నుంచి రోబోలను వినియోగించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక, కేరళ నుంచి వచ్చిన జాగిలాలతో అణ్వేషిస్తూ సొరంగంలో ఒకే చోట ముగ్గురు ఉన్నట్లుగా కొన్ని ప్రాంతాలు గుర్తించామని తెలిపారు.
బాధితుల కుటుంబాలకు అండగా ఉంటాం
కేరళ నుంచి వచ్చిన జాగిలాలతో అణ్వేషిస్తే సొరంగంలో ఒకే చోట ముగ్గురు ఉన్నట్లుగా కొన్ని ప్రాంతాలు గుర్తించామని మంత్రి తెలిపారు. ప్రమాదంలో చిక్కుకుని ఆచూకీ తెలియకుండా పోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. డీవాటరింగ్, డీసిల్టింగ్ కొనసాగుతుందన్నారు. మార్చి 11వ తేదీన సమీక్ష తర్వాత మరో ప్రకటన విడుదల చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications