వేముల రోహిత్ ఆత్మహత్యకు కొత్త ట్విస్ట్ ఇచ్చిన స్మృతి ఇరానీ
ధర్మశాల: అమేథీలో ఆయనపై పోటీ చేసినందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నాడని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. అందుకు విద్యా సంస్థలను యుద్ధభూమిగా, విద్యార్ధులను రాజకీయ ఉపకరణాలుగా వాడుకుంటున్నాడని విమర్శించారు. ఆ రకంగా ఆమె రోహిత్ ఆత్మహత్యకు కొత్త ట్విస్ట్ ఇచ్చారు.
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేయడం, వర్సిటీలో నిరసన దీక్షకు దిగడం వంటి చర్యలతో రాహుల్ ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆమె ధర్మశాలలో ఆరోపించారు. అమేథీలో తన పోటీకి రాహుల్ వేరే ఎక్కడైనా ప్రతీకారం తీర్చుకోవచ్చునని, అందుకు తానూ సిద్ధంగా ఉన్నానని అన్నారు.
రాహుల్ అందుకు విద్యా సంస్థను యుద్ధభూమిగా మార్చాడని ఆరోపించారు. విద్యార్థులను రాజకీయ ఉపకరణాలుగా వాడుతున్నాడని స్మృతి ఇరానీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే తాను ధైర్యంగా అమేథీలో పోటీ చేశానని అంటూ మరి ఇప్పుడు తానెందుకు భయపడాలని అన్నారు.
రోహిత్ ఆత్మహత్యను స్వార్థ ప్రయోజనం కోసం వినియోగించుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు విమర్శించారు. ఈ ఘటనపై ఆ పార్టీ లేనిపోని రాద్ధాంతం చేస్తోందని ఆయన ఆక్షేపించారు. వాస్తవానికి కాంగ్రెస్ పాలనలో అలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నా ఏనాడూ పట్టించుకోలేదని దుయ్యబట్టారు.
రోహిత ఆత్మహత్య దురదృష్టకరమని ఆయన అన్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని చెప్పారు. పుదుచ్చేరిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో వెంకయ్య మాట్లాడారు. తమిళనాడులోని ఓ నేచురోపతీ కాలేజీలో ముగ్గురు విద్యార్థినుల ఆత్మహత్యను ఈ సందర్భంగా ప్రస్తావించిన ఆయన, ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా అక్కడికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఆడపిల్లల జీవితాలు కాంగ్రెస్ నేతలకు ముఖ్యం కాదా? అని వెంకయ్య ఎద్దేవా చేశారు.