రోహిత్ సూసైడ్: ఫేస్బుక్ కామెంట్లపై రాహుల్ ఆరా, ఆ వీడియోపై ఆగ్రహం!
హైదరాబాద్: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాదులోని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ నివాసం వద్ద ఆందోళన నిర్వహించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో దత్తాత్రేయ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
వారు తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఫోటోలు ఉన్న జెండాలతో వారు నిరసన తెలిపారు. దత్తాత్రేయతో పాటు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రాజీనామా చేయాలని జాగృతి కార్యకర్తలు డిమాండ్ చేశారు.
Cartoon: Dalit scholar commits suicide
దత్తాత్రేయ రాజీనామా చేయాల్సిందే : పిడమర్తి
హెచ్సీయూ పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు తమ పదవులకు రాజీనామా చేయాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు.
రోహిత్ ఆత్మహత్యకు కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. మిగతా నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలి. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీలు ఝులిపించడం అమానుషమని పేర్కొన్నారు.
తీవ్రమవుతున్న నిరసనలు
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ వర్గానికి చెందిన విద్యార్థుల నుంచి రాహుల్ గాంధీకి నినాదాల హోరుతో స్వాగతం లభించింది. రాహుల్ను చూసిన ఉత్సాహంలో రోహిత్ తరఫు విద్యార్థులు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. వర్సిటీలో రాహుల్ గాంధీ రాక నేపథ్యంలో విద్యార్థులు బిజెపి హఠావో... అంటూ నినాదాలు చేశారు. పలుచోట్ల విద్యార్థులు నిరసనలు చేపడుతున్నారు.
వర్సిటీలో రాహుల్ గాంధీ
ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ మంగళవారం నాడు కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. పిహెచ్డి విద్యార్థి రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో ఆయన వర్సిటీలో పర్యటించి, విద్యార్థులను వివరాలు అడిగారు. రోహిత్ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. అలాగే, ఫేస్బుక్ కామెంట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.
రోహిత్ చనిపోవడానికి ముందు ఏం జరిగింది? లీకైన వీడియోపై ఆగ్రహం
ఇదిలా ఉండగా, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వీడియో ఒకటి లీకైంది. ఏబీవీపీ విద్యార్థులు, రోహిత్కు మధ్య జరిగే వివాదం ఈ వీడియోలో ఉంది. ఇప్పుడు ఈ వీడియోనులీక్ చేయడంపై రోహిత్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోవైపు బిఎస్పీ అధ్యక్షురాలు మాయావతి హైదరాబాద్ రానున్నారని తెలుస్తోంది.