రేవంత్ ఎఫెక్ట్, నాదే పొరపాటు: రూ.10 కోట్లపై నాయిని, కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంపై..
హైదరాబాద్: తాను ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే రూ.10 కోట్లు ఇస్తానని తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనకు చెప్పారని నాయిని నర్సింహా రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయనపై, కేసీఆర్ పైన ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
చదవండి: రూ.10 కోట్లపై నాయిని చెప్పారు, కొడంగల్లో రూ.100 కోట్లు: కేసీఆర్పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
నాయిని వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసీఆర్పై కేసు నమోదు చేయాలని రేవంత్ శనివారం ఈసీని కూడా కోరారు. కేసీఆర్ రూ.10 కోట్లు ఇస్తానన్నారని నాయిని చెప్పిన విషయాన్ని రజత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. నాయిని వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని లేదంటే తన ఫిర్యాదును ఆధారంగా చేసుకొని కేసీఆర్పై కేసు నమోదు చేయాలని కోరారు. తన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న నేపథ్యంలో నాయిని స్పందించారు.
పొరపాటుగా చెప్పా
కేసీఆర్ రూ.10 లక్షలే ఇస్తానని చెప్పారని, తానే పొరపాటుగా రూ.10 కోట్లుగా చెప్పానని నాయిని అన్నారు. రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఆదేశాలను శిరసా వహిస్తానని, ఆయనతో ఫోన్లో మాట్లాడుతున్నానని చెప్పారు. గత ఎన్నికల్లో రూ.5 లక్షలు లేక రూ.10 లక్షలు ఇస్తానని చెప్పారని, తాను పొరపాటుగా చెప్పానని అన్నారు.
కేసీఆర్ అపాయింటుమెంట్ ఇవ్వలేదనడంపై
కేసీఆర్ ఆదేశాలను తాను శిరసావహిస్తానని, ఆయన తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదనేది నిజం కాదని నాయిని చెప్పారు. ఆయనతో తాను ఫోన్లో మాట్లాడుతున్నానని తెలిపారు. తన అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి టికెట్ రాకపోతే కేసీఆర్ వద్ద మరో ప్రత్యామ్నాయం ఉండే ఉంటుందని, అంతేగానీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ప్రసక్తే లేదని చెప్పారు. ముషీరాబాద్ టిక్కెట్ వస్తుందని భావిస్తున్నామన్నారు.
రేవంత్ ఓడిపోవడం ఖాయం
తాను కాంగ్రెస్లోకి వెళ్తాననే ప్రచారం జరుగుతోందని దీనిని ఖండిస్తున్నానని నాయిని అన్నారు. నేను సోషలిస్టునని, తన జీవితం అంతా కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటం చేశానని, తనపై దుష్ప్రచారం చేస్తే కోర్టుల్లో క్రిమినల్, పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. గత ఎన్నికల్లో పోటీ కోసం తనకు కేసీఆర్ రూ.10 కోట్లు ఇస్తారని అనలేదని, రూ.10 లక్షలు అని ఆయన చెప్పగా తాను పొరపాటుగా రూ.10 కోట్లు అని చెప్పానని, దీనిపై రేవంత్ చిల్లర రాజకీయం చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్దే అధికారం అన్నారు. కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓటమి ఖాయమన్నారు.
రేవంత్ రెడ్డి దిక్కుమాలినతనం
తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ ఎప్పటికీ గడ్డం కుమార్గానే మిగిలిపోతారని నాయిని ఎద్దేవా చేశారు. ముషీరాబాద్లో శుక్రవారం మీడియా సమావేశంలో గత ఎన్నికల గురించి మాట్లాడానని, ముషీరాబాద్ నుంచి గాకుండా ఎల్బీనగర్ నుంచి పోటీ చేయాలని తనకు కేసీఆర్ చెప్పారని, తన వద్ద డబ్బుల్లేవని ఆయనకు చెప్పానని, పార్టీ ద్వారా రూ.5 లక్షలో, రూ.10లక్షలో సమకూరుస్తామని చెప్పారని, దీని గురించి మాట్లాడుతూ పొరపాటుగా రూ.10 కోట్లు అని చెప్పానని, రేవంత్ దీనిని సుమోటో కేసు పెట్టాలని గొడవ చేయడం దిక్కుమాలినతనమన్నారు.
చంద్రబాబు తరఫున వకాల్తా, అమిత్ షా దిక్కుమాలిన వ్యాఖ్యలు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తరఫున వకాల్తా పుచ్చుకొని కేసీఆర్పై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని నాయిని మండిపడ్డారు. ఇలాంటి పనులు చేసి రేవంత్ కొడంగల్లో ఘోరంగా ఓడిపోబోతున్నారని, గతంలో మంత్రిగా పనిచేసిన డీకే అరుణ శాసనసభ రద్దు గురించి కోర్టులో కేసు వేయడం ఆమె అవగాహనరాహిత్యానికి నిదర్శనమన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేక మర్రి శశిధర్ రెడ్డి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, టీఆర్ఎస్ను ఒంటరిగా ఎదిరించే శక్తి లేక టీడీపీ, సీబీఐ, కోదండరాంలను కాంగ్రెస్ ఆశ్రయించిందని, తమ పార్టీకి 100 సీట్లు వస్తాయన్నారు. కేసీఆర్, టీఆర్ఎస్ పైన ఇటీవల బహిరంగ సభలో అమిత్ షా దిక్కుమాలిన వ్యాఖ్యలు చేశారన్నారు.