Alert: ఢిల్లీ హైకోర్టు సీజే వాట్సాప్ డీపీతో రూ. 2 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్: సైబర్ నేరగాళ్ల మోసాలకు అంతులేకుండా పోతోంది. ప్రముఖ వ్యక్తులను కూడా వదలకుండా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ సతీశ్ చంద్ర పేరుతో మోసానికి పాల్పడ్డారు. సతీశ్ చంద్ర చిత్రాన్ని వాట్సాప్ డీపీగా పెట్టుకుని ఒకరి వద్ద రూ. 2 లక్షలు కాజేశారు.
సతీశ్ చంద్ర కొంతకాలం కిందట ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. అయితే, ఆయన ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకున్న నేరగాళ్లు.. తెలంగాణ హైకోర్టులో సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న శ్రీమన్నారాయణ అనే అధికారికి సీజేనే మెసేజ్ చేసినట్లు ఓ సందేశం పంపారు.
నేను ప్రస్తుతం ఓ ప్రత్యేక సమావేశంలో ఉన్నాను. అత్యవసరంగా నాకు డబ్బు అవసరముంది. కానీ, నా బ్యాంక్ రికార్డులన్నీ బ్లాక్ అయ్యాయి. మీకో అమెజాన్ లింక్ పంపిస్తాను. దాన్ని క్లిక్ చేసి రూ. 2 లక్షల విలువ చేసే గిఫ్టు కార్డులు పంపించాలి' అని సైబర్ నేరగాళ్లు.. సీజే జస్టిస్ సతీశ్ చంద్ర మెసేజ్ చేసినట్లుగానే సదరు సబ్ రిజిస్ట్రార్కు పంపారు.
అయితే, తనకు సీజేనే మెసేజ్ పంపారని భావించిన సబ్ రిజిస్ట్రార్.. చెప్పిన విధంగానే రూ. 2 లక్షల గిఫ్టు కార్డులు పంపారు. ఆ తర్వాత ఆ వాట్సాప్ నెంబర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. ఆ నెంబర్ కు కాల్ చేయగా.. స్విచ్చాఫ్ వచ్చింది. ఈ క్రమంలో తాను మోసపోయానని గ్రహించిన సబ్ రిజిస్ట్రార్.. సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.
బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల మోసాలు పెరిగిపోతున్నాయని.. ఇలాంటి కాల్స్, మెసేజ్ లు వచ్చినప్పుడు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. అమెజాన్ గిఫ్టులంటూ కాల్స్ వస్తే.. అది ఖచ్చితంగా సైబర్ నేరగాళ్ల పనేనని గుర్తించాలని చెబుతున్నారు.